Odisha: మా వాళ్లు సేఫ్.. రైల్వే మంత్రికి వివరించిన మంత్రి అమర్ నాథ్

by Disha Web Desk 16 |
Odisha: మా వాళ్లు సేఫ్.. రైల్వే మంత్రికి వివరించిన మంత్రి అమర్ నాథ్
X

దిశ, ఉత్తరాంధ్ర: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కటక్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో భేటీ అయ్యారు. వీరిద్దరూ ప్రమాద ఘటనపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి మంత్రి అమర్నాథ్ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, బంధువుల ఆచూకీ తెలియని వారు, వారి ఫోటోలు నేరుగా కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ ద్వారా పంపిస్తే, సదరు వ్యక్తుల సమాచారాన్ని బంధువులకు వీలైనంత త్వరగా అందజేసే ప్రక్రియను చేపట్టామని అమర్నాథ్ మంత్రి అశ్వినికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి వైష్ణవ్ గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం రైల్వే శాఖ మాత్రమే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడాన్ని తాను తొలిసారిగా వింటున్నానని చెప్పారు. ఇటువంటి సహాయక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాను అభినందిస్తున్నానని వైష్ణవ్ చెప్పారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తన వెంట ఉన్న అధికారులను పిలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై వివరాలు నమోదు చేసుకోవాలని అశ్విని సూచించారు. అలాగే ఘటన జరిగిన వెంటనే ముగ్గురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యలలో నిమగ్నం చేయడం పట్ల కూడా కేంద్ర మంత్రి అభినందించారు.

మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 342 మంది ప్రయాణికులను స్వల్ప వ్యవధిలోనే గుర్తించామని, చనిపోయిన వ్యక్తిని కూడా గుర్తించి అతని మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి పరిహారం కూడా ప్రకటించామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యలు పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రైలు ప్రమాద దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు చాలా వరకు సురక్షితంగా బయటపడినట్టు కేంద్ర రైల్వే మంత్రికి చెప్పానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో తమ వారి వివరాలు తెలుసుకునేందుకు పెద్దగా ఎవరూ రానందున క్యాజువాలిటీస్ పెరిగే అవకాశం లేదని అశ్విని వైష్ణవ్‌కు వివరించామని అమర్నాథ్ చెప్పారు.


Next Story