Mp Family Kidnap Case: మరో ఐదుగురి అరెస్ట్

by Disha Web Desk 16 |
Mp Family Kidnap Case: మరో ఐదుగురి అరెస్ట్
X

దిశ, ఉత్తరాంధ్ర: ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కుటుంబీకుల కిడ్నాప్‌ కేసులో మరో ఐదుగురుని పీఎం పాలెం పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కిలో నగరంలో సంచలనం సృష్టించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్‌, భార్య జ్యోతి, స్నేహితుడి జీవీలను పాత నేరస్తుడు హేమంత్‌కుమార్‌, రౌడీ షీటర్‌ రాజేష్‌, ఇళ్ల దొంగ ఎర్రోళ్ల సాయి కలిసి కిడ్నాప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.కోటి 75 లక్షలు, బంగారు ఆభరణాలు కాజేయగా, కోటికి పైగా నగదును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ప్రధాన నిందితులు వెంకట హేమంత్‌కుమార్‌, రౌడీషీటర్‌ రాజేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

తాజాగా.. ఈ కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇళ్ల దొంగ ఎర్రోళ్ల సాయితో పాటు ప్రధాన నిందితులకు బాధితుల నుంచి నగదు చలామణి చేసిన బాలాజీ, ఆనంద్‌, గోవర్ధన్‌, చిన్న సాయిని అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు. ఈ ఐదుగురు కిడ్నాప్‌ వ్యవహారంలో డబ్బులు చేరవేయడంలో సంబంధం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్‌ డబ్బులతో బంగారం కొనుగోలు చేసిన రౌడీ షీటర్‌ రాజేష్‌ తల్లి, సోదరి, హేమంత్‌ ప్రియురాలు శుభాలక్ష్మిని పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిని కూడా అరెస్టు చేయనున్నట్టు తెలిసింది.


Next Story