Visakha: నువ్వేంటి నీ భాష ఏంటి?.. కొడాలి నానిపై విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం

by Disha Web Desk 16 |
Visakha: నువ్వేంటి నీ భాష ఏంటి?.. కొడాలి నానిపై విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్‌పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కొడాలి నాని భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అభివృద్ధి, వైసీపీ పరిపాలనా వైఫల్యాలు అన్నింటిపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే ప్రజా చార్జిషీట్‌పై చర్చిద్దామని సవాల్ విసిరారు. మాజీమంత్రి కొడాలి నాని ఒక్కరే వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు వచ్చినా బీజేపీ సిద్ధమని విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైనా పూర్తయ్యాయని చెప్పగలరా..? అంటూ ఛాలెంజ్‌ చేశారు. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో అఫిడవిట్ రూపంలో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీ.. ఇప్పుడు స్నేహం కోసం వెంపర్లాడుతోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను గెలవబోతోందని జోస్యం చెప్పారు..

మరోవైపు ఏపీలో తాగడానికి నీళ్లు లేవని.. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు. శుక్రవారం గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోందని, 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని.. భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని ప్రకటించారు. తాను విసిరిన సవాల్‌పై కొడాలి నాని స్పందిస్తారో లేదా పారిపోతారా అనేది ఆయన ఇష్టం అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థణ్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed