Visakha: ఆది నుంచే కన్ను.. త్వరలో జిందాల్ గుప్పెట్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్?

by Disha Web Desk 16 |
Visakha: ఆది నుంచే కన్ను.. త్వరలో  జిందాల్ గుప్పెట్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్?
X

దిశ, ఉత్తరాంధ్ర: ఆది నుంచే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీ స్థాయిలో బడా కార్పొరేట్ యాజమాన్యాల కన్ను పడింది. ఇందుకోసం ఢిల్లీలో సదరు ప్రైవేట్ సంస్థ పావులు కదిపింది. ఈ క్రమంలోనే దక్షిణాది స్టీల్ పరిశ్రమలపై కేంద్రం కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ జిందాల్ గుప్పెట్లోకి వెళ్లనుందని సంకేతాలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కును జిందాల్ కంపెనీకి కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని కార్పొరేట్ల సామ్రాజ్యంలో బహుటంగానే చర్చించుకుంటున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సర్కార్ సహకరిస్తోందని బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి.

దక్షిణాదిలో ఉక్కు రంగంలో గుత్తాధిపత్యం తెచ్చే దిశగా కేంద్రం భారీ వ్యూహమే రచిస్తున్నట్లు ప్రజా సంఘాలు సహితం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ రంగంలోని భద్రావతి స్టీల్ ప్లాంటును ఇప్పటికే మూసేసి అమ్మకానికి పెట్టింది. తమిళనాడులో ప్రభుత్వ రంగంలోని మరో కర్మాగారానికి తాళాలు పడ్డాయి. ఇక మొత్తం దక్షిణాదిలో ప్రభుత్వ రంగంలోని ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ. నాణ్యత, ప్రమాణాలు, నిర్వహణలో తిరుగులేని విశాఖ స్టిల్‌ను అంచలంచెలుగా ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతీశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసి తీరుతామని ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రకటనలు చేస్తున్నారు. ఒక్కసారిగా అమ్మితే వ్యతిరేకత తీవ్రమవుతుందనే ఉద్దేశంతో మూలధనం, ముడిపదార్థాల సరఫరాకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రకటన విడుదల చేశారు. జిందాల్‌కు చెందిన జేఎస్ డబ్ల్యూ, జేఎస్పీఎల్ కూడా ఈవోఐలో పాల్గొన్నాయి.

ఆది నుంచే విశాఖ ప్లాంట్‌పై కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. విశాఖ ప్లాంట్‌లో కొత్త మోడళ్ల ఉత్పత్తులకు అనుమతులు రాకుండా 'ప్రైవేటు' సంస్థ ఢిల్లీలో పావులు కలిపినట్లు విశ్వసనీయ సమాచారం. సదరు ప్రైవేట్ సంస్థ బోర్డులో అధికారులను మేనేజ్ చేసినట్టు అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ ప్లాంటు రూ.16 వేల కోట్లు వెచ్చించి విస్తరించినా పాత ఉత్పత్తులకే పరిమితం కావాల్సి వచ్చింది. చాప కింద నీరులా ఇంతటి భారీ కుట్ర జరుగుతుండడంతో ఇది తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. దాంతో స్టీల్ ప్లాంట్ యూనియన్లు కేవలం ఆందోళనలను టెంపుల్‌కి పరిమితం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ పదే పదే కేంద్రంలోని పెద్దలు వ్యాఖ్యానిస్తుండడంతో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు మళ్లీమళ్లీ దెబ్బ తింటూనే ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్లను కాపాడుకునేందుకు ప్రజా సంఘాలు మరికొన్ని సంస్థలు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తుండటంతో కేంద్రం అడుగులు ఆలోచనలో పడ్డాయి. కేంద్రంలో ఉన్న బిజెపికి ఈ విషయంలో ప్రజల పూర్తిగా వ్యతిరేకిస్తుండడంతో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పగ్గన్ సింగ్ కులస్తే ఇటీవల విశాఖ వచ్చినప్పుడు విశాఖ బుక్కు పరిశ్రమ ప్రైవేటుకరణ ఆలోచన లేదని కీలక వ్యాఖ్యలు చేసి కొన్ని గంటల్లోనే మాట మార్చేశారు.

ప్రభుత్వంలోని మంత్రులే ఈ విధంగా మాట మార్చేసి వ్యాఖ్యలు చేస్తుండడంతో కేంద్రంపై ఉత్తరాంధ్ర ప్రజలు మరింతగా వ్యతిరేకరించారు. ఉత్తరాంధ్ర ప్రజలే కదా ఏం చేయగలరు అనుకుంటున్న కేంద్రానికి తెలంగాణలోని బీఆర్ఎస్ రూపంలో ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి వ్యతిరేక గళం వినిపించింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు సహితం మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. చివరకు కామెడీ పొలిటిషన్‌గా పేరందున కేఏ పాల్ సైతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కొనేస్తానంటూ మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటో కేంద్రానికి ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ ముందుకు రావడం కార్మికుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం ప్రకటనలు చూస్తుంటే.. విశాఖ ఉక్కు కోసం ఎందరో మహానుభావుల త్యాగఫలాన్ని అవహేళన చేసినట్లు అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిజంగానే ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే అందుకు బదులుగా రాష్ట్ర విభజన క్రమంలో ఆంధ్రకు ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్‌ను పలువురు సీనియర్ రాజకీయ నాయకులు తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed