ఐటీ హబ్‌గా విశాఖ...రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు : ఎంపీ విజయసాయిరెడ్డి

by Disha Web Desk 21 |
Vijayasai Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంను ఐటీహబ్‌గా మార్చబోతున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో విశాఖపట్నం ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ప్రముఖ ఐటీ సంస్థ పల్సస్ గ్రూపు సర్వే నివేదికలో వెల్లడయ్యిందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సోమవారం పలు అంశాలపై స్పందించారు. విశాఖలో ఒక్క ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనే 50 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పించే అవకాశం ఉందని ప్రముఖ ఐటీ సంస్థ పల్సస్ గ్రూపు సర్వే నివేదికలో వెల్లడించిందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

రెండెకరాల ఆసామికి హెరిటేజ్ ఎలా వచ్చిందో?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెండు ఎకరాలు మాత్రమే ఆస్థి ఉండేదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అలాంటి రెండెకరాల ఆసామి హెరిటేజ్ సంస్థను ఎలా స్థాపించారో ప్రజలకందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఇటీవలే నారా భువనేశ్వరి ‘మా కంపెనీలో 2 శాతం షేర్లు అమ్మితే రూ.400 కోట్లు వస్తాయి. అవినీతికి పాల్పడే కర్మ మాకేమిటి’ అని అన్నారని గుర్తు చేశారు. మ్యానిపులేట్ స్కిల్స్‌కు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరని అన్నారు. తన మనుషులను వ్యవస్థల్లోకి జొరబెట్టింది ప్రజా సేవ కోసమే అని చెప్పుకుంటారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ఫోటో షూట్ల కోసం కంచాలు పగలగొట్టడం, పుష్టిగా భోంచేసి దీక్షలు చేయడం చాలా వెగటుగా ఉందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.‘బల్లి శాస్త్రం’ప్రకారం ముందుగా చంద్రబాబుకు దోష పరిహారం చేయించండం ఉత్తమమని విజయసాయిరెడ్డి సూచించారు. రౌడీయిజం చూపిస్తా, ఉరికిస్తా అంటూ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడటం కర్మఫలమేనంటూ విజయసాయిరెడ్డి తీవ్రంగా దెప్పుపొడుపులు పొడిచారు. మరోవైపు ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ గా 'హృదయాలయం'కు గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారులకు పునర్జన్మనిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నిరుపేదల పాలిట దేవాలయమని అటువంటి దేవాలయం ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ గా తమిళనాడు గవర్నర్ చేతులు మీదుగా అవార్డు అందుకోవడం మిక్కిలి సంతోషకరమని అన్నారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed