సరికొత్త హంగులతో విశాఖ రైల్వే స్టేషన్ : ఎంపీ భరత్

by Thanuru Gopichand |

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎంపీ మాత్కుమిల్లి భరత్ వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులతో కలిసి స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సరికొత్త హంగులతో విశాఖ రైల్వే స్టేషన్ : ఎంపీ భరత్
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎంపీ మాత్కుమిల్లి భరత్ వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులతో కలిసి స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 500 కోట్ల భారీ వ్యయంతో పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయన్నారు. రాబోయే 20 నెలల్లో విశాఖ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో దర్శనమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణతో పాటు స్టేషన్ పశ్చిమ రైల్వే గేట్ ప్రాంతాన్ని కూడా ప్రయాణికులకు సులభతరంగా ఉండేలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ఉత్తర ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయిందని శ్రీభరత్ తెలిపారు. విశాఖలోని సిరిపురంలో ఉన్న వీఎంఆర్‌డీఏ (VMRDA) భవనంలో జోనల్ జనరల్ మేనేజర్ (GM) కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు ఎంపీ వెల్లడించారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా అదనపు రైల్వే లైన్ల నిర్మాణం, లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని మౌలిక వసతులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story