విజయవాడ ఉగ్రమూలాల కేసు.. ముగ్గురికి రిమాండ్

by Naga Rani Yarlagadda |

విజయవాడ ఉగ్రమూలాల కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు. జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సీఎంఎం కోర్టు. ఫోన్ల డేటాలో కీలక విషయాలు.

విజయవాడ ఉగ్రమూలాల కేసు.. ముగ్గురికి రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టయిన ముగ్గురు యువకులకు విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (CMM) కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను విచారించిన న్యాయస్థానం, వారికి ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో పట్టుబడిన వారిని షరీఫ్, డానిష్, మరియు సొహైల్ బేగ్ అనే యువకులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై తీవ్రమైన దేశ వ్యతిరేక ఆరోపణలు ఉండటంతో పోలీసులు పక్కా సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. యువతను తప్పుదోవ పట్టించేలా, ఉగ్రవాద సంస్థల పట్ల ఆకర్షితులయ్యేలా పోస్ట్‌లు పెడుతున్నట్లు సమాచారం. దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరు ప్రణాళికలు రచిస్తున్నారని, కొందరు అనుమానిత వ్యక్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు కోర్టుకు వివరించారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషించగా విద్రోహ చర్యలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు. ఈ కేసులో వీరి వెనుక ఉన్న ఇతర వ్యక్తులు ఎవరు? వీరికి ఎక్కడి నుంచైనా నిధులు అందుతున్నాయా? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. వీరి నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాన్ని రాబట్టేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

Next Story