నాకు వాటితో సంబంధం లేదన్న కేంద్రమంత్రి!

by Thanuru Gopichand |

ఇంటి పేరు ఆధారంగా అవినీతి అంటగడితే చర్యలు తప్పవంటున్న కేంద్రమంత్రి కార్యాలయం.

నాకు వాటితో సంబంధం లేదన్న కేంద్రమంత్రి!
X

దిశ, వెబ్ డెస్క్ : తన ఇంటి పేరుతో వ్యాపారాలు జరుగుతుండడంతో ఏపీకి చెందిన ఎంపీ.. కేంద్రమంత్రికి తిప్పలు తప్పడం లేదు. ఆ పేరుతో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా.. ఇంకేదైనా అయినా తనకు అంటగడుతుండడం ఆయనను కంగారు పెడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇంటి పేరుతో జరుగుతున్న వ్యాపారాల చిత్రాలు వైరల్ అవుతుండడం ఆయనను మరింత డిస్టర్బ్ చేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో స్వయంగా తానే ఓ బహిరంగ ప్రకటన చేశారు. తనకు సంబంధిత ప్రచారాలకు తగినట్లుగా ఎటువంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో (X.com) పోస్టు చేయించారు. ఎవరికి సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా.. తనను ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంలో ఆయన ఈ వివరణ ప్రచురింపజేసినట్లుగా తెలుస్తోంది.

ఏమని పోస్ట్ చేశారంటే..

గుంటూరు ఎంపీ.. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Shekar) ఎక్స్ ఖాతాలో ఆయన కార్యాలయం ఓ ప్రకటనను ప్రచురించింది. ప్రజా గమనికగా పేర్కొంటూ విషయాన్ని పబ్లిష్ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసానిపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ఆయన కార్యాలయం హెచ్చరిక విడుదల చేసింది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు భారత్ లోని ఏ ట్రక్కింగ్ లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఆయన ఏ కంపెనీని నడపడం లేదని, నియంత్రించడం లేదని, ప్రోత్సహించడం లేదని, మద్ధతు ఎంత మాత్రం ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కేంద్రమంత్రికి రియల్ ఎస్టేట్, మైనింగ్, రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఆయనకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని ఆయన కార్యాలయం ప్రకటించింది.

దురుద్దేశపూరిత చర్యలుగా..

ఎక్కడైనా ప్రచారం అవుతున్న ఏ ప్రకటనలు, చిత్రాలు, ప్రచార సమాచారం లేదా ఆరోపణలు పూర్తిగా అబద్ధమైనవని కేంద్రమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కొన్ని ప్రచారాలు ఉన్నాయంది. అవి ఆయన గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేసిన చర్యలుగా పరిగణించబడతాయని హెచ్చరించింది.

తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి..

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎటువంటి అక్రమాలు.. అనైతిక కార్యకలాపాలకు మద్ధతునివ్వరని ఆయన కార్యాలయం తెలిపింది. అంతేకాకుండా ఎటువంటి అవినీతిని ఆయన సహించరని స్పష్టంగా తెలియజేసింది. ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని మనవి చేసింది.

చట్టపరమైన చర్యలు తప్పవు..

కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరును దుర్వినియోగం చేసినా, ఆయన ప్రతిష్ఠను అనధికారికంగా వినియోగించినా, ముందస్తు సమాచారం లేకుండా ఆయన గుర్తింపును వాడుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించింది. ఎవరైనా తప్పుడు ప్రచారాలను, గుర్తింపు దుర్వినియోగాన్ని గమనిస్తే తక్షణమే తమ కార్యాలయానికి తెలియజేయాలని ఎక్స్ వేదికగా కోరింది.

Next Story