‘నవ వధూవరులకు శ్రీవారి ఆశీస్సులు’.. టీటీడీ కీలక ప్రకటన

by Jakkula.Mamatha |

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

‘నవ వధూవరులకు శ్రీవారి ఆశీస్సులు’.. టీటీడీ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కుటుంబ సమేతంగా తిరుమల ఆలయానికి చేరుకుని.. భక్తి శ్రద్ధలతో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఈ క్రమంలో తాజాగా టీటీడీ శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది. నూత‌నంగా వివాహం చేసుకునే పెళ్లి కుమారై, పెళ్లి కుమారుడికి శ్రీ‌వారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వర‌స్వామి, శ్రీపద్మావతీ అమ్మ‌వారి ఫొటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, ‘కల్యాణ సంస్కృతి’ పుస్తకం టీటీడీ అందిస్తోంది. ప్ర‌తి ఏడాది శుభ‌లేఖ పంపిన‌ ల‌క్ష‌కు పైగా వ‌ధువ‌రుల‌కు శ్రీ‌వారి దీవెనలతో క‌ల్యాణం జ‌రుగుతోంది.

నూతన వధూవరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని టీటీడీ భక్తులకు కల్పిస్తోంది. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల శుద్ధ ప్రతి విభాగం (తపాలా విభాగం) సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం ల‌క్ష‌కు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారు. ఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి. నూతన వధూవరులు త‌మ పూర్తి చిరునామాతో ”కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి – 517501” పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం.155257 సంప్రదించగలరని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Next Story