ప్రాణం తీసిన ట్రిపుల్ రైడింగ్ : ఇద్దరు దుర్మరణం.. ఒకరికి సీరియస్

by Disha Web Desk 21 |
ప్రాణం తీసిన ట్రిపుల్ రైడింగ్ : ఇద్దరు దుర్మరణం.. ఒకరికి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అటు పోలీస్ శాఖ సైతం అనేక అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నాయి. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ తమ నిండు ప్రాణాలను చేజేతులా తీసేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. ట్రిపుల్‌ రైడింగ్‌లో వెళుతున్న బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రమాదం జరిగిందిలా..

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండల కేంద్రానికి చెందిన అభి, కిషోర్‌, ప్రేమ్‌ కుమార్‌ ముగ్గురు స్నేహితులు. తెనాలిలో బంధువుల ఇంట్లో ఉన్న ప్రేమ్ కుమార్‌ను కలిసేందుకు అభి, కిషోర్‌లు ఆదివారం రాత్రి తెనాలి వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు కలిసి తెనాలి నుంచి భట్టిప్రోలుకు బైక్‌పై వెళ్లేందుకు యత్నించారు. బైక్‌పై వేగంగా వెళ్తుండగా చెంచుపేట వైపు నుంచి ఫ్లైఓవర్‌ ఎక్కిన తరువాత బైక్‌ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అభి (21), కిషోర్‌ (19)లు అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమ్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానికులు ప్రేమ్‌ కుమార్‌ను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలరు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఇకపోతే మృతులు అభి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా... కిషోర్‌ గుంటూరు మిర్చి యార్డులో ముఠా కార్మికుడుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed