విశాఖ ఉక్కుకు భూములు బదలాయించం: ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్రం సమాధానం

by Disha Web Desk 21 |
విశాఖ ఉక్కుకు భూములు బదలాయించం: ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్రం సమాధానం
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం సేకరించిన భూములను ఆ ప్లాంట్‌కు బదలాయించడం ద్వారా దాని ఆస్తుల విలువను, రుణ శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరించడానికి కారణాలు ఏమిటి.? అని విజయసాయిరెడ్డి నిలదీశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించి అప్పగించింది. తదనంతరం ఆ భూములపై సర్వహక్కులను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు బదలాయించడం జరిగింది. స్టీల్‌ ప్రాజెక్ట్‌ కోసం ఆ భూములను వినియోగించుకోవడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు పవర్‌ ఆఫ్‌ అటార్నీ జారీ చేసింది. అందువలన ఆ భూములపై యాజమాన్య హక్కులను ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు. రౌర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ మినహా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన స్టీల్‌ ప్లాంట్ల భూములపై సర్వహక్కులు ఆయా ప్లాంట్ల పేరిట దఖలు పడి ఉన్నట్లు ఉక్కు శాఖ మంత్రి తెలిపారు. భిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌, ఇస్కో స్టీల్‌ ప్లాంట్‌, సేలం స్టీల్‌ ప్లాంట్‌ అలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, విశ్వేశ్వరయ ఐరన్‌, స్టీల్‌ ప్లాంట్‌లు నెలకొల్పిన భూములకు ఆయా ప్లాంట్‌లే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాయి. రౌర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ భూములు మాత్రం లీజు పద్దతిలో కొనసాగుతున్నాయని ఉక్కు శాఖ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే పేర్కొన్నారు.

Next Story

Most Viewed