- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డూ సరికొత్త రికార్డు.. నాణ్యతలో తిరుగులేని ప్రసాదం
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అదించారు. ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలను విక్రయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలు విక్రయమవ్వగా, 2025లో 1.10 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం 2026లో 1.21 కోట్లకు పైగా విక్రయాలు నమోదు అయ్యాయి.
రోజుకు 4 లక్షలకుపైగా లడ్డూల తయారీ
శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ.. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది. లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను టీటీడీ వినియోగిస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నారు. ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుండి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి.
సంప్రదాయ దిట్టం ప్రకారమే తయారీ
శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ “దిట్టం” ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు.
24 గంటలూ నిరంతరాయంగా సేవలు
శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.
భారీ మౌలిక సదుపాయాలు
లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూంది పోటు, పడి పోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి.
రోజుకు 15 టన్నుల శెనగపప్పును పిండిగా మార్చే ఫ్లోర్ మిల్
2,10, 000 కిలోల సామర్థ్యం గల నెయ్యి నిల్వ ట్యాంకులు
30 టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్
2 నుండి 7 రోజుల వరకు ముడి సరుకులు నిల్వ ఉంచగల ఉగ్రాణం
కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బూంది తరలింపు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్లో 56 కౌంటర్ల ద్వారా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు.
ప్రత్యేక రోజులకు భారీ బఫర్ స్టాక్
భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






