ఇటు ప్రజల్లోకి లోకేశ్.. అటు ఢిల్లీకి చంద్రబాబు

by Disha Web Desk 21 |
ఇటు ప్రజల్లోకి లోకేశ్.. అటు ఢిల్లీకి చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో ఈనెల 27 నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం తాజాగా ఈనెల 27 నుంచి ఎక్కడైతే పాదయాత్రను నిలిపివేశారో అక్కడ నుంచే తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి తిరిగి ఈ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇందుకు కార్యకర్తలు సైతం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే అదేరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిళ్లీ వెళ్లబోతున్నారు. చంద్రబాబు నాయుడు తరఫున ఆయన కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 26న సిద్ధార్థ లూథ్రా తనయుడు వివాహం జరగనుంది.అయితే 27న ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రిసెప్షన్‌లో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 28 వరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో త్వరలోనే ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

Next Story

Most Viewed