శ్రీఆత్మసాక్షి సర్వేతో వైసీపీలో టెన్షన్..!

by Dishafeatures2 |
శ్రీఆత్మసాక్షి సర్వేతో వైసీపీలో  టెన్షన్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'అసలే అధికారంలో ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశాం. రాష్ట్రంలో దాదాపు 80శాతానికి పైగా కుటుంబాలు ప్రభుత్వం తరపున ఏదో ఒక లబ్ధిపొందాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మనకే అధికారం అప్పగిస్తారు. ఎవరు ఎలా వచ్చినా ఎన్నికలకు మాత్రం సింహాల్లా సింగిల్‌గా వెళ్దాం' ఇది వైసీపీ లెక్కలు. ఇదంతా ఒక ఎత్తైతే వైనాట్ 175 అంటూ పార్టీ అధినేత సీఎం జగన్ ధీమా వ్యక్తం చేసేస్తున్నారు. వైసీపీ సింహం అని మిగిలిన పార్టీలన్నీ పిల్లులు అని కూడా అభివర్ణించేసుకుంటున్నాయి. కానీ సీన్ మాత్రం రివర్స్. సొంత సర్వేలు.. ఇతర సర్వేలన్నీ వైసీపీకి ప్రతికూలంగానే వస్తున్నాయి. అయినప్పటికీ వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే తాజాగా ఐప్యాక్ ఇచ్చిన నివేదిక వైసీపీ గుండెల్లో గుబులు రేపుతోందట. ఎమ్మెల్యేల పనితీరుపై కుండబద్దలు కొట్టిందట. అంతేకాదు ప్రజల్లో ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పడంతో వైసీపీ ఈ ప్రతికూలత వచ్చే ఎన్నికల్లో ఎక్కడ బొప్పికడుతుందోనన్న ఆందోళన నెలకొందట.

గాలి తీసేసిన శ్రీఆత్మసాక్షి సర్వే

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థ అయిన శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇప్పటికే వైసీపీ ఆశలపై నీళ్లు చల్లింది. వైసీపీకి అనుకూల పరిస్థితులు కష్టంగా ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తే ఇక వైసీపీ దుకాణం సర్ధుకోవాల్సిందేనని చెప్పింది. అంతేకాదు టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే ఇక వైసీపీ గెలుపొందే స్థానాలు మరింత పడిపోతాయని స్పష్టం చేసేసింది. విడివిడిగా పోటీ చేసినా 1.25శాతం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా మారతారని తెలిపింది. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ విడిగా పోటీ చేస్తే మాత్రం వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేసింది. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలలో ఈ సర్వే జోష్ నింపితే.. వైసీపీలో మాత్రం గుబులు రేపుతోంది. ఇదే తరుణంలో ఇవన్నీ గాలిసర్వేలంటూ సీపీలోని కొందరు కొట్టి పారేస్తున్నారు. కానీ లోలోపల మాత్రం మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

సొంత సర్వేలోనూ అదే పరిస్థితి

ఇకపోతే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నమ్మకమైన సంస్థతో ప్రతీ మూడు నెలలకోసారి సర్వేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే సీఎం జగన్‌కు ఆ సంస్థ తాజా నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వేలో 45 మంది ఎమ్మెల్మేల పనితీరు బాగోలేదని తెలిపిందట. వచ్చే ఎన్నికల్లో ఈ 45 మంది అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేసిందట. అలాగే మరో 20 మంది ఎమ్మెల్యేలు అసమ్మతితో సతమతమవుతున్నారని, వీరి మధ్య సయోధ్య కుదరకపోతే వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిందట. ఇలా మెుత్తం 65 మంది ఎమ్మెల్యేల భవితవ్యం దాదాపు క్లోజ్ అని సొంత సంస్థ సర్వేలో స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ అఖండ విజయం సాధించగా వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీవైపు మెుగ్గు చూపుతున్నారు. మరో 65 మందిపై ప్రజల్లోనూ.. అసమ్మతి వెంటాడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుపొందే స్థానాలను సైతం ప్రకటించినట్లు తెలుస్తోంది. రాయలసీమలో 30-38, కోస్తాలో 20-26, ఉత్తరాంధ్రలో12-15, ఉభయగోదావరి జిల్లాలలో10-12 స్థానాల్లో వైసీపీ గెలుపొందే అవకాశం ఉన్నట్లు సర్వేల్లో తెలిపినట్లు తెలుస్తోంది. సొంత సర్వేలో కూడా వ్యతిరేక గాలి వీస్తుండటంతో వైసీపీ అంతర్మథనం చెందుతోందట.

ఆ వర్గాల అసంతృప్తి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్బన్ ప్రాంతంలో ప్రజాదరణ తగ్గిందని సర్వేలో తేలింది. అయితే రూరల్ ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదని సర్వేలో వెల్లడైంది. రూరల్ లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఫ్యాన్ గుర్తుకే ఓటు పడుతుందని అయితే అర్బన్ లో మాత్రం అంత ఆదరణ ఉండదని తేటతెల్లమైందట. పట్టణ ప్రాంతాలతోపాటు నిరుద్యోగులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో రైతులు సైతం ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని సర్వేలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ నాయకత్వం వైనాట్ 175 అనేదానికన్నా అధికారంలోకి వచ్చే దానిపై ఇప్పటి నుంచే కార్యచరణ చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని సర్వేలే పేర్కొన్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed