- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరకలెత్తిన తెలుగు భాషాభిమానం
తెలుగు వెలుగులీనింది.. రెండు రోజుల పాటు తెలుగు భాషాభిమానం ఉరకలెత్తింది.. భాషా ప్రేమికుల్లో తెలుగు నదీప్రవాహాన్ని పోలింది.. ఎందరో తెలుగు భాషా ఉద్దండులు.. మరెందరో తెలుగును ప్రేమించే ఘనులు.. ..

దిశ, అమలాపురం: తెలుగు వెలుగులీనింది.. రెండు రోజుల పాటు తెలుగు భాషాభిమానం ఉరకలెత్తింది.. భాషా ప్రేమికుల్లో తెలుగు నదీప్రవాహాన్ని పోలింది.. ఎందరో తెలుగు భాషా ఉద్దండులు.. మరెందరో తెలుగును ప్రేమించే ఘనులు.. నేటి తరానికి తెలుగు గొప్పతనాన్ని గుర్తుచేసే ఔత్సాహిక పండితులు.. రేపటి తరం మరవనీయకుండా మేల్కొలిపే చిన్నారి ద్వయం.. మొత్తం మీద రెండు రోజులు తెలుగు వెలుగునీలింది..
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు అమలాపురం కిమ్స్ వేదికగా రెండు రోజులపాటు నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం అయ్యాయి.. ఎందరో మహోన్నతులు ఈ మహా సభలకు విచ్చేసి తెలుగును వెలిగిద్దాం అంటూ ప్రతినబూనారు.. ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతంపై కార్యక్రమ నిర్వహకులను అభినందనతలతో ముంచెత్తుతున్నారు.. ఇటు తెలుగు భాషను ప్రేమించే వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.. సభల విజయవంతం చేసినందుకు కృషిచేసిన అందరికీ తెలుగు మహా సభల నిర్వాహకులు, కిమ్స్, చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కె.వి.వి సత్యనారాయణ రాజు(చైతన్య రాజు) కృతజ్ఞతలు తెలిపారు.
దేశ విదేశాల నుంచి ప్రముఖుల రాక..
తెలుగు రాష్ట్రాలనుండే కాక దేశ విదేశాల లోని అనేక మంది తెలుగు వారి నుండి విశేష స్పందన లభించిందని, సుమారు 50 వేల మందికి పైగా ప్రత్యక్షంగా హాజరు కాగా లక్షల సంఖ్యలో తెలుగు వారు సాంఘిక మాధ్యమాల ద్వారా ఈ సభలను వీక్షించి స్పందించడం చాలా సంతోషదాయకం, స్ఫూర్తిదాయకమని చైతన్య రాజు అన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమాలలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్లు, అనేక మంది న్యాయ మూర్తులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, ప్రవచన కర్తలు, అష్టావధానులు, శత, సహస్రావధానులు, రాష్ట్రం నలుమూలాల నుండి కవులు, తెలుగు భాషాభిమానులు విచ్చేసి ఈ ప్రపంచ మహా సభలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సభలలో 16 తెలుగు సాహిత్య సదస్సులు, సుమారు 150 మంది కవులచే జరిపిన కవి సమ్మేళనం అద్భుతం, అనూహ్యం మరియు అమృత కలశం అని మరియు అంత మంది కవులు మరియు పండితులకు ఒకే వేదికపై సన్మానం అరుదైన అవకాశమన్నారాయన. ప్రతి యేటా ఇదే విధంగా భాగస్వాములై సహాయ సహకారాలు అందజేసి తెలుగు మహా సభలను విజయవంతం చేస్తూ తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడాలని చైతన్య రాజు, కిమ్స్ ఎం.డి. రవి కిరణ్ వర్మ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ శశి కిరణ్ వర్మ కోరారు.






