సేవలో లభించే తృప్తి అనిర్వచనీయం : వెంకయ్య నాయుడు

by Disha Web Desk 13 |
సేవలో లభించే తృప్తి అనిర్వచనీయం : వెంకయ్య నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సేవ‌కు మించిన భ‌గ‌వ‌దారాధ‌న ఈ లోకంలో లేద‌ని, సేవ‌తో ల‌భించే తృప్తి అనిర్వ‌చ‌నీయ‌మైన‌ద‌ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వం, వైద్యులు వివిధ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఆదివారం ఉదయం స్వర్ణ భారత్ ట్రస్ట్, ఆంధ్ర హాస్పటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వ‌హిస్తున్న వైద్య బృందానికి వెంకయ్యనాయుడు అభినంద‌న‌లు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు సామాన్య ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్హాసక్తులు కనబరచాలని సూచించారు.

ఉచిత వైద్యం,ఉచిత విద్యకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అందుకోసం అత్యధిక నిధులను కేటాయించాలని కోరారు. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. దేశంలో వైద్య విధానాన్ని కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. చేపను పట్టే గాలాన్ని ప్రభుత్వం ఇవ్వాలి గాని, ఉచితంగా చేపను ప్రజలకు ఇస్తే, వారు స్వయంగా కష్టపడి అర్జించే శక్తిని కోల్పోతారని తెలిపారు.

మన దేశ జనాభా 140 కోట్లకు పైగా చేరుకుందని, ఈ పరిణామం సంతోషపడాలో సంతాపపడాలో తెలియడం లేదన్నారు. 20 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని అలాగే 18 శాతం ప్రజలు ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారన్నారు. ఎవరికివారు స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలని, ఆరుబయట నడవడం సూర్యరశ్మి శరీరానికి తాకితేనే కొన్ని జబ్బులు మటుమాయం అవుతాయన్నారు. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్ చూడడం ఆలస్యంగా నిదురించడం అనారోగ్యానికి హేతువు అని వెంకయ్య నాయుడు అన్నారు.


Next Story