దొంగ పోలీసులు

by Dishafeatures2 |
దొంగ పోలీసులు
X

దిశ, కర్నూలు ప్రతినిధి : రక్షణ కవచంగా ఉండాల్సిన వారే భక్షించేశారు. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన వారే దొంగలుగా మారారు. డబ్బు ఆశకు లోనై ఖాకీలు తమ వక్ర బుద్ధిని చూపించారు. స్టేషన్ లో భద్రంగా ఉంచిన వెండి, నగదును రాత్రికి రాత్రి మాయం చేశారు. నేరస్తులకు సంకెళ్లు వేయాల్సిన పోలీసులే కటకటాల్లోకి లెక్కిస్తున్నారు. ఈ ఘటన పోలీసు శాఖకే కళంకం తెచ్చింది. ఈ కేసు వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు.

2021 జనవరి 27న కర్నూలు పట్టణ సీఐ విక్రమ సింహా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు రాష్ర్టం సేలం పట్టణానికి చెందిన సందన్ భారతి, గోవింద రాజ్ వాహనాన్ని అడ్డుకున్నారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా రూ.2.05 లక్షల నగదు , 105 కేజీల వెండి వస్తువులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని అప్పటి స్టేషన్ రైటర్ రమణ బాబుకు అప్పగించారు. వెండి వస్తువులపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రూ.35 లక్షల జరిమానా విధించారు.

రైటర్ రమణ బాబు వెండి వస్తువులను పోలీసు ప్రాపర్టీ రూంలో భద్రపరిచారు. రూ. 2.05 లక్షల నగదును సొంత ఖర్చులకు వాడుకున్నారు. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ అయిన తర్వాత సదరు డబ్బును, తర్వాత రైటర్ గా పని చేసిన అమరావతికి ఇచ్చారు.

ఎలాగైనా కాజేయాలని..

యజమాని గోవింద రాజ్ సొమ్ముని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుసుకుని ఆ సొమ్ము కాజేసేందుకు అమరావతి ప్లాన్ చేసింది. ఈ విషయం ఆమె భర్త విజయ్ కుమార్ భర్తకు చెప్పింది. వెండి వస్తువులు కరిగించేందుకు ఈ క్రమంలో ఆమె మరిది భరత్ సింహాకు బంగారు దుకాణంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాన్ఫర్ అయిన రమణ బాబుతో పంచుకోవడంతో .. ఆయన కూడా ఈ స్కామ్ లో భాగస్వామ్యం కలుపుకునేందుకు ఒప్పుకున్నారు.

దొంగతనం చేసిందిలా..

కర్నూలు జిల్లా కేంద్రంలోని బుధవార పేటకు చెందిన ఎల్ అమరావతి, ఆమె భర్త బీ విజయ్ కుమార్, మరిది బీ నాగరాజు, ప్రకాష్ నగర్ కు చెందిన బీ భరత్ సింహా, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నేతాజీనగర్ కు చెందిన రైటర్ డీవీ రమణబాబులు కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. 2022 మే 24న కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో రిపోర్టు అయిన ఎక్సైజ్ కేసులలోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే పనిలో పోలీసు అధికారులు ఉండగా.. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వెండి వస్తువులను సీఐ గదిలోని బీరువాలోకి మార్చారు.

దీంతో నిందితురాలైన కానిస్టేబుల్ అమరావతి ఇంటికెళ్లి తర్వాత రాత్రి 11.30 గంటలకు సివిల్ డ్రెస్ లో స్టేషన్ కు వచ్చారు. అక్కడ ఉన్న సెంట్రీతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 2, 3 గంటల మధ్య భర్తతో కలిసి పోలీసు స్టేషన్ లోకి వచ్చి బీరువాలో వెండి వస్తువులను దొంగిలించారు. అనంతరం భరత్ సహాయంతో దాదాపు 23 కేజీల వెండిని నగదుగా మార్చుకున్నారు.

Next Story

Most Viewed