ఏపీలో మరో రాజధాని.. అంబటి సన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 16 |
ఏపీలో మరో రాజధాని.. అంబటి సన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మూడు రాజధానుల మాట వినిపించింది. కర్నూలు, అమరావతి, విశాఖ కేంద్రంగా మూడు రాజధానులు ఉండాలంటూ అటు వైసీపీ తీర్మానించింది. కర్నూలులో హైకోర్టు, విశాఖలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అడుగులు వేసింది. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో రాజధాని పేరు వినిపిస్తోంది. అయితే ఇది ప్రకటించింది అధికార పార్టీ నేతలు మాత్రం కాదు. అధికార పార్టీకి మద్దతు ఇస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. కొద్ది రోజులుగా వైసీపీకి మద్దతుగా ఆయన ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ నేతల కార్యక్రమాలకు హాజరవుతున్నారు.


తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో చేపట్టిన ‘యువత-హరిత’ కార్యక్రమానికి క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి తిలక్ రోడ్‌లో మార్గాని భరత్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి అంటూ అంబటి రాయుడు సన్సేషనల్ కామెంట్స్ చేశారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని పేర్కొన్నారు. రాజమండ్రి చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. అభివృద్ధి ఎలా ఉంటుందో మార్గాని భరత్ చేసి చూపించారని చెప్పారు. దేశంలోనే ఏపీ నెంబర్ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. రాజమండ్రిలో ఒకవైపు హరిత విప్లవం, మరోవైపు క్రీడారంగంపై యువత దృష్టి సారించాలని అంబటి రాయుడు పిలుపునిచ్చారు.

అయితే అంబటి రాయుడు సాంస్కృతిక రాజధాని రాజమండ్రి అని అభివర్ణించడం యాధృచ్చికంగా జరిగిందా.. వైసీపీ నేతల మాటగా అన్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. మరోవైపు పలువురు టీడీపీ నేతలు మాత్రం అంబటి రాయుడు వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని, నాలుగో రాజధాని కూడా ఏర్పాటైతే రాష్ట్రాభివృద్ధిని పట్టుకోలేమని వ్యంగంగా విమర్శిస్తున్నారు.


Next Story