రేపు మూడు పార్టీల అధినేతలు భేటీ.. అసలు ఏం జగరబోతోంది?

by Kema Shiva Kumar |

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి.

రేపు మూడు పార్టీల అధినేతలు భేటీ.. అసలు ఏం జగరబోతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ అంశంపై తాజాగా వెలువడిన సిట్ (SIT) నివేదికను ఆధారంగా చేసుకుని, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు.

తదుపరి యాక్షన్ ప్లాన్ ఇదే..

సిట్ నివేదికలో జంతు కొవ్వు (Animal Fat) ప్రస్తావన లేదని వైసీపీ వాదిస్తుండగా.. ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై రేపటి భేటీలో చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలను వివరించేలా ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టి, దోషులను చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియను వేగవంతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఈ సమావేశంలో కేవలం తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశమే కాకుండా, రాబోయే రాజ్యసభ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా చర్చించబోతున్నట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన 60 లక్షల కిలోల నెయ్యిలో నాణ్యత లేదని, అది అసలు నెయ్యే కాదని సిట్ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కేవలం పామాయిల్, ఇతర రసాయనాలతో కూడిన ద్రవాన్ని నెయ్యిగా సరఫరా చేసి రూ.233 కోట్ల మేర శ్రీవారి నిధులను దోచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ నివేదికలోని అంశాల ఆధారంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను (Masterminds) పట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇక సిట్ ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు ప్రస్తావన లేదని వైసీపీ వాదిస్తుండగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆ వాదనను తీవ్రంగా ఖండించారు. జంతువుల కొవ్వు నుంచి తీసిన రసాయనాల ద్వారానే ఈ సింథటిక్ నెయ్యి తయారైందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని వారిద్దరూ మండిపడిన విషయం తెలిసిందే.

Next Story