పవన్ కల్యాణ్ కృషితో గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

by Gantepaka Srikanth |

రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) పనులు వేగం పుంజుకున్నాయి.

పవన్ కల్యాణ్ కృషితో గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) పనులు వేగం పుంజుకున్నాయి. "ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు.. ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత" లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకువెళ్తోంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) నేతృత్వంలో జల్ జీవన్ పనులు వేగవంతానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి గ్రామీణ కుటుంబానికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

సిబ్బంది సామర్థ్యాల పెంపు

నీటి నాణ్యత.. శుద్ధి.. సరఫరాలకు ప్రాధాన్యత ఇస్తూ మునుపెన్నడూ లేని విధంగా క్షేత్ర స్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నత స్థాయి ఇంజినీర్ వరకు... గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బ తీస్తే... పవన్ కల్యాణ్ కృషి, ప్రణాళికు జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గత ప్రభుత్వ ధోరణితో కారణంగా నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభ్యర్ధనలతో కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువు నాలుగేళ్లపాటు పొడిగించింది. ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల పనులను పథకం విస్తరణలో ప్రారంభించి, దానికి అనుగుణంగా పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరుతుంది. రానున్న 30 ఏళ్ల కాలానికి, కోటీ 21 లక్షల 71 వేల మందికి రక్షిత మంచినీటి ఇవ్వాలన్న సంకల్పం నెరవేరుతుంది.

ప్రకాశం జిల్లాలో అతి పెద్ద తాగునీటి ప్రాజెక్టు

జల్ జీవన్ మిషన్ పథకం కింద గత జులై 4వ తేదీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు నీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా 1,290 కోట్లతో మెగా ప్రాజెక్టుకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా పరిధిలో ఇంత పెద్ద తాగునీటి ప్రాజెక్టు ప్రారంభంచడం ఇదే ప్రథమం. దీంతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తాగు నీటి సరఫరా మెగా ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.

ఆయన నిబద్దత, దూరదృష్టితో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు చకచకా ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఇంటికి సురక్షితమైన జలాలు చేరేలా గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని సంసిద్దం చేస్తున్నారు. మొట్ట మొదటిసారి సిబ్బంది అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నీటి భద్రత, సుస్థిర నిర్వహణ, నీటి నాణ్యత పెంపు, నియంత్రణ, వ్యర్ద జలాల పునర్వినియోగం, క్షేత్ర స్థాయి పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఎస్.ఈ, ఈఈ స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ స్థాయి వరకు సుమారు 1,400 మందికి శిక్షణ పూర్తి చేశారు. గ్రామ స్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్ నెలల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీటి సరఫరాకి అవసరం అయిన సాంకేతికత వినియోగంపై కూడా సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. సిబ్బందిలో నైపుణ్యం పెంపొందించడంతో పాటు జవాబుదారీతనం పెంచే విధంగా అంతర్గత శిక్షణ తరగతులకు పవన్ శ్రీకారం చుట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్దేశిత జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు లోబడి... రోజుకి ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగు నీరు అందించాలన్న సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పనులను ముందుకు తీసుకువెళ్తున్నారు.

Next Story