మాజీ సీఎం జగన్ పై ఏపీ సాధుపరిషత్ ఆగ్రహం

by Thanuru Gopichand |

తిరుమలపై వైయస్ జగన్ (YS Jagan) వ్యాఖ్యలు బాధాకరం. అక్కడ ఎటువంటి తప్పు జరిగిన భక్తులు బాధపడతారని ఏపీ సాధుపరిషత్ (AP Sadhu Parishad) అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ అన్నారు.

మాజీ సీఎం జగన్ పై ఏపీ సాధుపరిషత్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలపై వైయస్ జగన్ (YS Jagan) వ్యాఖ్యలు బాధాకరం. అక్కడ ఎటువంటి తప్పు జరిగిన భక్తులు బాధపడతారని ఏపీ సాధుపరిషత్ (AP Sadhu Parishad) అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ అన్నారు. పరకామణి చోరీని జగన్ చిన్న కేసుగా అనడంపై సాధుపరిషత్ తరపున ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ పరాకమణి వ్యవహారం చేసిన వ్యాఖ్యలను స్వామిజీ ఖండించారు. పార్టీ తరపున ఎటువంటి వివరణ రాకపోవడాన్ని తప్పుబట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించడం సరికాదన్నారు. వైసీపీ నేతలకు హిందువులంటే హీనంగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి అంటే అంత దీనంగా భావిస్తురా అని అసహనం వ్యక్తం చేశారు.

ఎన్నికలొస్తే హిందువులు విడిపోయి ఓట్లేస్తారని పగటి కలలు కంటున్నారా అని ప్రశ్నించారు. హిందువుల్లో చైతన్యం వచ్చిందని.. ప్రతి హిందువు కూడా వైసీపీ చేస్తున్న దురాగతాలను గమనిస్తున్నారని అన్నారు. గతంలో తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టే వైసీపీని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. అయినా కూడా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని, పశ్చాత్తాపం కలగడం లేదని అన్నారు. వెంకటేశ్వర స్వామినే కించపరిచి మాట్లాడేంత అహం భావమా అని నిలదీశారు. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి.. కానీ వెటకారంగా మాట్లాడడం ఏమిటని అన్నారు. దేవుడి కంటే మనం గొప్పవారమా అని అడిగారు. ప్రధానులు కూడా స్వామివారి ముందు సాకిల పడుతున్నారన్నారు.

చర్చికి, మసీదుకు తమను ఆహ్వానిస్తే వినమ్రులై వెళ్తామన్నారు. తాము ఇతర మతస్తుల మనోభావాలను గౌరవిస్తామన్నారు. అన్ని మతాలను తాము ప్రేమిస్తామన్నారు. కానీ వైసీపీ నేతలో ఆ సమభావన కనిపించడం లేదన్నారు. హిందువుల మీద, హిందూ ఆచారాల మీద, దేవాలయాలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని శ్రీనివాసానంద ఆరోపించారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వైసీపీ నేతలపై ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి వారి దివ్యమూర్తి నల్లరాయితో పోల్చిన భూమన కరుణాకర రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిని వైసీపీ ఇచ్చిందని గుర్తు చేశారు. హిందువులకు వైసీపీ నేతలు చేసిన మేలు ఏంటో చెప్పాలన్నారు.

ఒక్క పూజారికైనా కనీసం ఐదు వేల రూపాయలు ఇచ్చారా అని వైయస్ జగన్ ను అడిగారు. కూటమి ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథక మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచారన్నారు. ఏ రోజు వైసీపీ నేతలు హిందువుల పక్షాన నిలిచారో చెప్పాలన్నారు. వైవీ సుబ్బారెడ్డిని, కరుణాకర రెడ్డిని విచారణకు పిలవగానే భయం మొదలైందన్నారు. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు. త్వరలోనే బండారం బయటపడుతుందన్నారు. ఇంత జరుగుతుంటే పరకామణి చోరీ చిన్న విషయం అంటారా అని నిలదీశారు.

Next Story