ఇంతకూ ఏం రాశారు..? గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు నారా లోకేశ్ లేఖ

by Disha Web Desk |
ఇంతకూ ఏం రాశారు..? గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు నారా లోకేశ్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ముస్లిం మైనారిటీలపై దాడులు చేసే నేరస్తుల్ని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని లేఖలో లోకేశ్ ఆరోపించారు. చాలా ఘటనల్లో వైసీపీ శ్రేణులే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడితే అధికార పార్టీ ఒత్తిడితో కొంతమంది పోలీసులు నేరస్థులతో చేతులు కలిపి కేసులు నీరుగార్చుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలపై చోటు చేసుకున్న 50 ఘటనలు, తన దృష్టికి వచ్చిన సంఘటనల వివరాలను తన లేఖకు జత చేసి గవర్నర్‌కు పంపించారు.

వైసీపీ వేధింపుల వల్ల నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, పల్నాడు ప్రాంతంలో ముస్లిం మైనార్టీల ఆస్తులపై దాడులు, హత్యలు, గెంటివేతల అంశాలు, పులివెందుల సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను సవివరంగా లేఖకు లోకేశ్ జత చేశారు. లౌకిక వాదంపై జరిగే దాడుల్లో గవర్నర్ జోక్యం అవసరమని లోకేశ్ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను మరింత వెనుకబాటుతనం... పేదరికంలోకి నెట్టే విధంగా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల కూల్చివేత, భౌతిక దాడులు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, తప్పుడు కేసుల నమోదు నుంచి హత్యల వరకూ అనేక విధాల ముస్లింలు హింసకు గురవుతున్నారు అని ఆరోపించారు. ప్రభుత్వ ప్రేరేపిత చర్యలతో వైసీపీ నేతలు చాలా మంది ముస్లిం మైనార్టీల ఆస్తులు లాక్కున్నారు అని ధ్వజమెత్తారు.

తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులు, వేధింపులతో ముస్లింలు అనేక అవమానాలకు గురయ్యారు అని లోకేశ్ లేఖలో ఆరోపించారు. కొన్నిచోట్ల ఉద్యోగాల నుంచి కూడా తొలగించి జీవనోపాధికి గండి కొట్టారన్నారు. పల్నాడు ప్రాంతంలో పలు చోట్ల టీడీపీకి అండగా నిలిచారనే అక్కసుతో ముస్లిం మైనార్టీలను గ్రామ బాహిష్కరణ చేశారన్నారు. బాధితులకు పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోగా ఎదురు తప్పుడు కేసులు నమోదు చేశారని లేఖలో వివరించారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలని లేఖలో కోరారు. మీ సత్వర చర్యలు మాత్రమే ప్రాథమిక హక్కులను కాపాడటంతో పాటు ముస్లిం మైనార్టీలను సంరక్షిస్తుంది అని ఆశిస్తున్నట్లు లోకేశ్ లేఖలో తెలిపారు.

Also Read...

అవినీతిపరులు నీతులు బోధించడమా!?

రైతులను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోలు చేయకుండా వేధింపులేంటి?: పవన్ ఫైర్



Next Story

Most Viewed