మంగళగిరిపై వైసీపీ, టీడీపీ ఫోకస్

by Dishafeatures2 |
మంగళగిరిపై వైసీపీ, టీడీపీ ఫోకస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలుపు ఓటములపై వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. అటు టీడీపీ సైతం పులివెందుల, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులకు చెందిన టీడీపీ నేత భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గెలుపొందడంతో వైనాట్ పులివెందుల అని టీడీపీ అంటోంది. పులివెందులలో కూడా గెలిచి తీరుతామని టీడీపీ గంటాపథంగా చెప్తోంది. దీంతో వైసీపీ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఓడించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ రంగంలోకి దిగడంతో గుంటూరులో వైసీపీ అభ్యర్థులు ఓటమి ఖాయమని టీడీపీ అభ్యర్థులకే ఆ ప్రాంత రైతులు పట్టం కడతారని అంతా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గెలుపు నల్లేరుపై నడకేనని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇది సక్సెస్ అయితే వైసీపీ గెలుపు తథ్యమని భావిస్తోంది.

మంగళగిరిపైనే ఫోకస్

ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజవర్గం అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గంలో మళ్లీ గెలుపొందాని ఎమ్మెల్యే ఆర్కే వ్యూహాలు రచిస్తుంటే ఈసారి ఖచ్చితంగా గెలుపొంది అధికార పార్టీ విమర్శలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన ఇరు పార్టీలు పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు, తమవైపు తిప్పుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

అమరావతిలో మరోసారి గెలుపు కోసం సీఎం జగన్ ఇప్పటికే ప్రయత్నాలు మెుదలు పెట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి నుంచి లోకేశ్‌ను ఓడిచేందుకు పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధానిగా వైసీపీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో అక్కడ చీలిక తీసుకువచ్చి ఎలాగైనా గెలుపొందాలని వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్-5 జోన్ వ్యూహమేనా?

అమరావతి నియోజకవర్గంలో రైతుల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలోని ఓ వర్గానికి చెందిన రైతులను తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసేందుకు అడుగులు వేస్తోంది. ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేద వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంలో ఇప్పటికే హైకోర్టులో వైసీపీ విజయం సాధించింది. అయితే అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఆ ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయినప్పటికీ సుప్రీంకోర్టులైనా పోరాడాలని నిర్ణయించింది. అయితే ఇదంతా మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించడంలో భాగమేనని తెలుస్తోంది.పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. అందరూ సపోర్ట్ చేస్తారు. నవ నగరాల నిర్మాణ కోసం కేటాయించిన స్థలం కాకుండా ఇతర ప్రాంతంలోని స్థలంలో లేఅవుట్ వేసి అభివృద్ధి చేసి పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. ఈ పరిణామాలే వైసీపీకి కలిసి వస్తాయని...టీడీపీకి మైనస్ అవుతాయని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. మరి ఇది ఎలా వర్కౌట్ అవుతోందోనని వేచి చూడాలి.


Next Story

Most Viewed