టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు

by Disha Web Desk 21 |
టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంట్రాక్ట్ ఉద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు టీటీడీ పాలకమండలి అంగీకారం తెలిపింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర ‌రెడ్డి నేతృత్వంలో టీటీడీ పాలకమండలి అన్నమయ్యభవన్‌లో మంగళవారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత కలిగిన ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తామని పాలక మండలి ప్రకటించింది. మరోవైపు ఈ నెల 23 నుంచి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ హోమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని ఇందులో పాల్గొనదలచిన వారు రూ.1000ల టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. అంతేకాదు టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25.67 కోట్లు నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ సొమ్మును తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు.

ప్రతీ ఉద్యోగికి ఇంటి స్థలం

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరునాకర రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు గ్రేడ్ 1 హోదాలో పని చేస్తున్న ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇచ్చేందుకు పాలక మండలి అంగీకారం తెలిపిందని భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. ఇకపోతే తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధికి రూ.6.15 కోట్, టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6850 చెల్లించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రసాదాలు, ముడిసరుకులు నిల్వ ఉంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు కేటాయింపునకు పాలకమండలి ఆమోదం తెలిపింది.ఇ దిలా ఉంటే తిరుమలలోని ఎఫ్ఎంఎస్ సేవలు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏడాది పాటు పొడిగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఎఫ్ఎంఎస్ సౌత్, ఈస్ట్ ప్యాకేజీ కోసం రూ.23 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఆరోగ్యం విభాగంలో పని చేస్తున్న 1694 మంది కాంట్రాక్టు సిబ్బంది మరో ఏడాది పాటు కొనసాగింపుతోపాటు వారి జీతభత్యాలు ఇచ్చేందుకు రూ.3.40 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు.

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు:

స్విమ్స్‌లో నూతన భవనాల నిర్మాణానికి రూ.3.35 కోట్లు

స్విమ్స్‌లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ల ఏర్పాటుకు రూ.74 కోట్లు

స్విమ్స్‌లో రూ.197 కోట్లతో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణం

ఆయుర్వేద హాస్పిటల్‌లో నూతన భవన నిర్మాణానికి రూ.1.65 కోట్లు

రుయాలో టిబి రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణం

ఎంఆర్‌పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్దికి రూ.4.5 కోట్లు

పుదిపట్ల జంక్షన్ నుంచి వకులమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణంకు రూ.21 కోట్లు



Next Story

Most Viewed