జూ.ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యపై అనుమానాలు.. స్పందించిన చంద్రబాబు

by Disha Web Desk 2 |
జూ.ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యపై అనుమానాలు.. స్పందించిన చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి చెందడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యాం ఎన్టీఆర్‌ అభిమాని. ఎన్టీఆర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లకు, ఇతర కార్యక్రమాలకు తరచూ హాజరవుతూ ఉండేవాడు. అయితే చింతలూరులో శ్యాం అకస్మాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడిన ఫోటోలలో అతని కాళ్లు భూమిపైన ఆని ఉండటంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. శ్యామ్ నిజంగానే ఉరి వేసుకుని చనిపోతే అతని కాళ్లు భూమిమీద ఎందుకు ఉంటాయి. మెడ దగ్గర ఉరి వేసుకున్న ఆనవాళ్లు ఎందుకు లేవు? ముఖం, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉన్నాయి? చేతి దగ్గర ఎవరో కోసినట్లుగా ఎందుకు కనిపిస్తోంది? అని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్యామ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అని ఆరోపిస్తున్నారు. శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్యాం మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ‘వి వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ట్యాగ్‌ను సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దృష్టికి చేరేలా ఈ ట్వీట్‌ను షేర్ చేయాలని కోరుతున్నారు. వారాహి విజయయాత్రలో పవన్ ప్రస్తావిస్తే ఖచ్చితంగా ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని అంటున్నారు. ఇకపోతే విశ్వక్‌సేన్ నటించిన దాస్ కా దమ్ కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెక్యూరిటీని దాటుకుని స్టేజీ మీదికి వెళ్లాడు శ్యాం. ఆ సమయంలో సెక్యూరిటీ అతడిని పక్కకు తోసేయబోతుంటే ఎన్టీఆర్ వారిని వారించి అతనితో కలిసి ఫోటో దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు అప్పుడు ఇప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.

సమగ్ర దర్యాప్తు జరిపించాలి : చంద్రబాబు

శ్యామ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. శ్యాం మృతికి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. శ్యాం మృతిలో వైసీపీ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం వి వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed