Tirumala:ఆ రోజే సూర్య జయంతి.. ఆర్జిత సేవలు రద్దు

by Jakkula.Mamatha |

సూర్య జయంతి సందర్భంగా తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది.

Tirumala:ఆ రోజే సూర్య జయంతి.. ఆర్జిత సేవలు రద్దు
X

దిశ,వెబ్‌డెస్క్: సూర్య జయంతి సందర్భంగా ఈ నెల(జనవరి) 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ‌సప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.

వాహన సేవల వివరాలు..

*తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.

*ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.

*ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.

*మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.

*మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.

*సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.

*సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.

*రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

ఆర్జిత సేవలు రద్దు..

ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

Next Story