రాష్ట్రంలో మాడు పగిలిపోయే ఎండలు.. అత్యధికంగా ఎక్కడంటే..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-01 12:29:33  IST  )

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ప్రారంభంలోనే ఎండలు మాడు పగిలేలా మండుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు....

రాష్ట్రంలో మాడు పగిలిపోయే ఎండలు.. అత్యధికంగా ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ప్రారంభంలోనే ఎండలు మాడు పగిలేలా మండుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం సాధారణంగా ఉన్నా మధ్యాహ్నం మాత్రం ఇళ్ల నుంచి బయటకు వస్తే మాడు పగిలిపోతోంది. ఓ వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇటీవల కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. అలాగే కర్నూలు జిల్లా లద్దగిరి, విజయనగరం జిల్లా నెలివాడ ప్రాంతాల్లో 39.9 డిగ్రీల మేర ఎండలు దంచికొడుతున్నాయి. తీర ప్రాంతం కావడంతో బాపట్లలో అత్యల్పంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంది.

తెలంగాణలోనూ...

మరోవైపు తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 38 డిగ్రీలు నమోదైనప్పటికీ, అది సాధారణం కంటే ఎక్కువేనని వాతావరణ శాఖ పేర్కొంటోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.

Next Story