గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు.. మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

by Ramesh Naini |

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు శనివారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు.. మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు శనివారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

ఓటీపీ ఉంటేనే సిలిండర్..

ఆందోళనతో ఎక్కువమంది గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేస్తున్నారని మంత్రి పయ్యావుల అన్నారు. పైప్డ్‌ గ్యాస్‌ కంపెనీలతోనూ సమావేశమవుతామని వెల్లడించారు. సిలిండర్‌ బుకింగ్‌ ఆన్‌లైన్‌లోనే ఉండాలని స్పష్టం చేసినట్లు వెల్లడిచారు. సిలిండర్‌ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారని, బ్లాక్‌మార్కెటింగ్‌కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్‌ ఇస్తారని అన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ సహకరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు.

Next Story