ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు

by Disha Web Desk 12 |
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాలంటీర్లు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇంతకాలం అధికార పార్టీనేతలతో అంటకాగి, వారు చెప్పిందే చేసిన వాలంటీర్లు ఎన్నికల కోడ్ కారణంగా ఒక్కసారిగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కాదని ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చుట్టూ నేతల చుట్టూ తిరుగుతున్నారని ఫిర్యాదు వస్తే చాలు ఎన్నికల కమిషన్ వేటు వేసేస్తుంది. అంతటితో ఆగకుండా పోలీసు కేసు కూడా బనాయిస్తుంది. దీంతో ఇటు అధికార పార్టీ నేతలకు , అటు వలంటీర్లకు ఊపిరి సలపడం లేదు.

వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపైనే అధిక ఫిర్యాదులు

వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని, 46 మందిపై చర్యలు తీసుకున్నామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా బుధవారం మీడియాతో చెప్పారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించామని, కొందరు వలంటీర్లను విధుల నుంచి తొలగించామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులైన కలెక్టర్లకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ విషయంలో ఎటువంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విశాఖలో మహిళా వాలంటీర్ పై పోలీసు కేసు..

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నెం.19 పరిధిలో గల సచివాలయం నంబర్.1086095 సంబంధించి వార్డు వాలంటీర్ పీ కరుణ రాజకీయ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఎన్నికల విధుల నుంచి తొలగించారు. అంతటితో ఆగక మువ్వల వాని పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

వాలంటీర్ లేకుండా పని ఎలా?

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు వదిలేసి అన్ని పనులకు వాలంటీర్ల పైనే ఆధార పడ్డారు. వాలంటీర్లు లేకుండా కొందరు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు వారు లేకుండా కార్యక్రమాలు కాదు ఏకంగా ఎన్నికలు చేయడం ఎలా అనే సందిగ్ధం వెంటాడుతోంది. నిన్నటి వరకు దగ్గరుండి అధికార పార్టీ నేతల పంపిణీల వ్యవహారమంతా వీరే చూశారు. ఇప్పుడు వీరు లేకుండా ఎలా అని కలవరపడుతున్నారు.

ఇప్పుడు గుర్తొచ్చామా..

ఐదేళ్లుగా మరచిపోయిన కార్యకర్తలను పలువురు శాసనసభ్యులు ఇప్పుడు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. వార్డు వారి సభలు, మండల వారి సభలు ఏర్పాటు చేసి కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ఉపన్యాసాలు దంచుతున్నారు. వాలంటీర్‌ల మోజులో తమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేతలకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని పలువురు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.


Read More..

రసవత్తరంగా అన్నమయ్య జిల్లా పొలిటికల్ వార్

Next Story