Nellore: టీడీపీ నేత ఆనంపై దాడి.. తీవ్ర ఆగ్రహంలో ఆ పార్టీ నేతలు

by Disha Web Desk 16 |
Nellore: టీడీపీ నేత ఆనంపై దాడి.. తీవ్ర ఆగ్రహంలో ఆ పార్టీ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు కిలారి వెంకట స్వామి నాయుడు అపార్ట్‌మెంట్‌లో కలకలం రేగింది. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై 8 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, మారణాయుధాలతో ఆనం వెంకటరమణారెడ్డి పై దాడి చేశారు. అయతే టీడీపీ నేతలు సికిందర్ రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, తదితరులు అడ్డుకున్నారు. దీంతో దుండగులు సికిందర్ రెడ్డిని నెట్టేయగా కిందపడి గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రెండు వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆనం వెంకట రమణారెడ్డి దగ్గర నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీని సైతం పోలీసులు సేకరించారు. అలాగే నిందితులు వదిలి వెళ్లిన రెండు బైక్‌లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు.

దాడి అనాగరికం , అప్రజాస్వామికం: అచ్చెన్నాయుడు

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడడం అనాగరికం, అప్రజాస్వామికం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సైకో చర్యలకు సమాధికట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. జగన్ తీరు చూస్తుంటే జర్మనీలో నాజీల దురాగతాలను కళ్ళకు కడుతుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరమా? ఎంత సేపు ప్రశ్నించే వారిని వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా అని హైకోర్టు పదే పదే ప్రశ్నించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుందని ఎద్దేవా చేశారు. జగన్ తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జ్యన్యాలను, దోపిడి విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జగన్ రెడ్డి సాధిస్తున్న దమనకాండకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉంది. దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. ఆనంకు భద్రత కల్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

దాడి దుర్మార్గం : యనమల రామకృష్ణుడు

టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఖండించారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని... పట్ట పగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి దాడులతో భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల అన్నారు. తమపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతామని హెచ్చరించారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed