Nellore జిల్లాలో ఆ ఇద్దరితో టీడీపీకి నష్టమేనట..!

by Disha Web Desk 16 |
Nellore జిల్లాలో ఆ ఇద్దరితో టీడీపీకి నష్టమేనట..!
X

దిశ, నెల్లూరు: తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు నమ్మకస్తుడిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అలాగే సోమిరెడ్డి చెప్పిందే వేదంగా చంద్రబాబు కూడా ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. సోమిరెడ్డి మీద నమ్మకంతో పార్టీలోని కీలక బాధ్యతలను సైతం చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దివంగత నేత ఎన్టీఆర్‌ వెంట నడిచినవారితో సోమిరెడ్డి కూడా ఒకరు. ఎంతో కాలంగా పార్టీని నమ్మి ఉన్నారు కాబట్టే సర్వేపల్లి నియోజకవరం నుంచి ఎన్నిసార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి మరి మంత్రి పదవిని కట్టబెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ సోమిరెడ్డిని నమ్మి టీడీపీ బాధ్యతలను అప్పగించింది. అదే ఇప్పుడు పార్టీకి పూర్తిగా మైనస్ అయ్యింది. పూర్తిగా నమ్మి నెల్లూరు జిల్లా పెత్తనం సోమిరెడ్డికి అప్పగించడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీలో తన కంటే ఎవరైనా ఎదుగుతున్నారని భావించినా, ఇతర పార్టీల నుంచి కీలక నేతలు రావాలనుకున్నా అడ్డుపడుతుంటారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.

ఆదాల పార్టీ మారేందుకు కారణం సోమిరెడ్డి

గతంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. సోమిరెడ్డి ప్రవర్తన నచ్చక ఎన్నికల చివరి నిమిషంలో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. ఆదాల నెల్లూరు రూరల్ టీడీపీ నుంచి పోటీకి దిగి చివరి నిమిషంలో ఆయన వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. సోమిరెడ్డి వ్యవహారశైలి నచ్చకే ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారేందుకు కారణమని సోమిరెడ్డి కుట్రలు భరించలేకే వైసీపీలో చేరినట్టు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు సోమిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత తమకు నేతలకు ఇవ్వడందని ఆదాల ఆరోపించారు. అంతేకాదు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న సమయంలో తనపై కావాలనే చంద్రబాబు వద్ద సోమిరెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆదాల వ్యాఖ్యానించారు. ఇలా సోమిరెడ్డి కారణంగా ఆదాల వంటి ఆర్థిక, బలమైన నేతను టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది.


ఇద్దరి నేతల్లోనే జిల్లా రాజకీయం

పూర్తిగా నెల్లూరు రాజకీయాలు ఇద్దరి నేతల చేతుల్లో ఉండడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఒకరు సోమిరెడ్డి అయితే మరొకరు బీదా రవిచంద్ర. ఆయనకు ప్రజల మద్దతు కన్నా చంద్రబాబు, లోకేష్ వద్ద మద్దతు సరిపోదుందన్న ఆలోచనలో రవిచంద్ర ఉన్నారని విమర్శలు ఉన్నాయి. ఇంత వరకు రవిచంద్ర ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు. అయినా రవిచంద్రను చంద్రబాబు నమ్మి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్న నేతలను పార్టీకి దూరం పెడుతూ ప్రజలు ముఖం కూడా చూడని రవిచంద్రకు పార్టీ అంతలా ఆదరిస్తుండటం పార్టీలో కొందరి నేతలకు మింగుడు పడడం లేదు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించే టీడీపీ నష్టపోతుందని నేతల్లో భావన ఉంది. ఎమ్మెల్యేగా కూడా గెలవని రవిచంద్ర లాంటివాళ్లను పార్టీ హక్కున చేర్చుకుని పదవులు కేటాయించి, ఎమ్మెల్మేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్న తాము రవిచంద్ర మాటలు వినాల్సిన ఖర్మ పట్టిందని నేతలు వాపోతున్నారట. ప్రాధాన్యత లేని వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఓటమిని కొనితెచ్చుకుంటున్నారని పార్టీ నేతల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రీధర్ రెడ్డి పార్టీలోకి ఎందుకు ఆహ్వానించడం లేదు

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన వారు. ఆయనకు జిల్లాలో పలుకుబడితో పాటు ఇప్పుడు సింపతీ కూడా తోడైంది. శ్రీధర్ రెడ్డి బలమైన నేత రెండు సార్లు తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నుంచి వేరు పడక ముందే ఆయన కంటూ సొంత క్యాడర్ ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో శ్రీధర్ రెడ్డి వంటి బలమైన నేత టీడీపీకి అవసరం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి వంటి బలమైన నేతలు దొరకడం కష్టం. అందుకే ఆయనను టీడీపీలో చేర్చుకోవడం వల్ల రూరల్ గెలుపునకు అవకాశం ఉంది.. శ్రీధర్ రెడ్డి స్వయంగా చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని కోటంరెడ్డి ఇదివరకే ప్రకటించారు. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడిన కొందరు నేతలు ఆయన్ను అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీధర్ రెడ్డి వంటి బలమైన నేత పార్టీలోకి వస్తే తమ ప్రాధాన్యత ఎక్కడ దెబ్బతింటుందోనని కొందరు నేతల్లో ఆందోళన చెంది. ఇందుకోసమే శ్రీధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం లేదని అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో శ్రీధర్ రెడ్డిపై విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నా నెల్లూరులో ఆ ఇద్దరు నేతలు మాత్రం చంద్రబాబు వద్ద దుష్ప్రచారం చేస్తూ పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి

ఆ నేతలు తగ్గితేనే పార్టీకి పూర్వ వైభవం

నెల్లూరు జిల్లాలో పార్టీ క్యాడర్‌ను కంట్రోల్ చేస్తున్న ఆ ఇద్దరి నేతల ప్రాధాన్యత తగ్గిస్తేనే జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరి నేతల పెత్తనాన్ని తగ్గించి స్వంత నిర్ణయాలు తీసుకునేలా నేతలు ప్రోత్సహిస్తే బావుంటుందని టీడీపీ క్యాడర్ భావిస్తుంది. ఆ ఇద్దరి నిర్ణయాలతో టీడీపీ ఇంతవరకు నష్టపోయింది చాలని, అధిష్టానం ఆలోచించి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం శ్రీధర్ రెడ్డి వంటి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం మంచిదని పార్టీ శ్రేణుల్లో అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed