Nellore: అజ్ఞాతం వీడిన మాజీమంత్రి.. పాలిటిక్స్‌లో మళ్లీ షురూ

by Disha Web Desk 16 |
Nellore: అజ్ఞాతం వీడిన మాజీమంత్రి.. పాలిటిక్స్‌లో మళ్లీ షురూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచారు. టీడీపీ కార్యక్రమాలకు ఆర్థికవనరులన్నీ ఆయనే సమకూర్చారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు సైతం ఆర్థికంగా అండగా నిలిచారు. అంతే ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో అప్పటి వరకు తెరవెనుక ఉన్న ఆ నాయకుడు తెరపైకి వచ్చేశారు. నిమిషాల వ్యవధిలో ఎమ్మెల్సీ అయిపోయారు క్షణాల్లో చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ సంపాదించేశారు. అక్కడితో ఆగిపోలేదు కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధాని విషయంలో అన్నీ తానై వ్యవహరించారు. కొన్ని రోజుల్లోనే టీడీపీలో నెంబర్ 2 పొజిషన్‌కు వెళ్లిపోయారు. టీడీపీలో ఓ వెలుగు వెలుగొందిన ఆ నేత 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

టీడీపీ హయాంలో అన్నీ తానై వ్యవహరించిన నారాయణ అధికారం కోల్పోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమరాతి భూముల్లో అక్రమాల కేసుల్లో సీఐడీ విచారణ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ కేసులు ఎదుర్కొన్నారు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో రాష్ట్రానికి దూరంగా బతుకుతున్నారు. అంతే ఎన్నికలు సమీపిస్తున్నాయనో లేక టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనో.. తన నియోజకవర్గానికి టికెట్ పోరు ఎక్కువవుతుందనో తెలియదు కానీ ఒక్కసారిగా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. దీంతో నెల్లూరు టీడీపీ నేతలు నారాయణ ఆగయా అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఓటమితో తిప్పలు

నారాయణ విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు తెచ్చున్న పొంగూరు నారాయణ టీడీపీకి అన్నీతానై వ్యవహరించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఆర్థికంగా వెన్నముకగా నిలిచారు. అంతే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. దీంతో వెంటనే నారాయణ జాక్ పొట్ కొట్టేశారు. ఏకంగా ఎమ్మెల్సీ అయి మంత్రి అయిపోయారు. అంతేకాదు టీడీపీలో నెంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ రాజధాని అమరాతి నిర్మాణంలో కీలకంగా మారారు.అంతేకాదు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా కీలకంగా మారారు.

ఒకవైపు మంత్రిగా ఉంటూనే నెల్లూరు జిల్లా రాజకీయం, నెల్లూరు సిటీ రాజకీయంపైనా ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వంలోనూ... నెల్లూరు జిల్లా రాజకీయంలోనూ కీలకంగా వ్యవహరించిన నారాయణ 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాదు రాష్ట్రంలో టీడీపీ కూడా ఘోరంగా ఓటమి పాలవ్వడంతో నారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీమంత్రిగా మారిన నారాయణను వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వెంటాడి మరీ కేసులు నమోదు చేశారు. అమరావతి భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి భూముల విషయంలో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. అనంతరం మధ్యంతర బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీమంత్రి పొంగూరు నారాయణ అలర్ట్ అయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు కేసులు, అరెస్ట్‌లతో సతమతమైన మాజీమంత్రి నారాయణ ఇక దూకుడు పెంచనున్నారు. ఇందులో భాగంగా వచ్చి రాగానే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టడంలో మాజీమంత్రి నారాయణ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఉప్పునిప్పుగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్ధుల్ అజీజ్‌లను ఒకే తాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేయడంలో కూడా కీలకంగా మారనున్నారు మాజీమంత్రి నారాయణ. ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా ఉన్న అబ్ధుల్ అజీజ్ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర బాధ్యతలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అప్పగించడంలో మాజీమంత్రి నారాయణ క్రియాశీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. ఇకపోతే వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని మాజీమంత్రి నారాయణ ధీమాగా ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావాలని ఆహ్వానించడం ఆయన సరేనని తెలియజేయడంతో నారాయణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం మీద ప్రజలంతా విసిగిపోయి ఉన్నారని కష్టపడి పనిచేస్తే ఇక అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదని మాజీమంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు.

గెలుపుపై ఫోకస్

నెల్లూరు సిటీ రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరుతో సతమతమవుతుంది. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్‌లు వర్గాలుగా విడిపోయారు. ఇది వైసీపీకి చాలా మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ ఇస్తే రూప్ కుమార్ యాదవ్ సహాయ నిరాకరణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇది తనకు కలిసి వస్తుందని మాజీమంత్రి నారాయణ యోచిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు సిటీలో టీడీపీని యాక్టివ్ చేసేందుకు రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా నారాయణ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుకు వెనుకాడే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

నెల్లూరు సిటీలో మాజీమంత్రి నారాయణకు మంచి పట్టుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కొట్టుకుపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు నారాయణకు బ్రహ్మరథం పడతారనే ప్రచారం ఉంది. నారాయణకు ఒకసారి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీమంత్రి నారాయణ ఎదుర్కొన్న ఇబ్బందులతో నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరిగిందని అది తన గెలుపునకు మరింత సహకరిస్తుందని మాజీమంత్రి నారాయణ భావిస్తున్నారు.

పోటీ రాకూడదనే రంగంలోకి

వైసీపీ ఆధిపత్య పోరుతో నెల్లూరు సిటీలో టీడీపీ గెలుపొందే అవకాశం ఉందని పలు సర్వేలలో వెల్లడైంది. మరోవైపు వైసీపీ సర్వేలలో కూడా అనిల్ కుమార్ యాదవ్‌కు నెగిటివ్ రిపోర్టు రావడంతో టీడీపీలోని కీలక నేతలు నెల్లూరు సిటీ నియోజకవర్గంవైపు చూస్తున్నారు. మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సైతం నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి దూరమైన ఆనం రామనారాయణరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి తన రాజకీయానికి విరామం పలకాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సైతం పోటీలో ఉన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి రోజు రోజుకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నారాయణ ఇక రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో ఆయన అడిగితే చంద్రబాబు ఎక్కడ హామీ ఇస్తారనే భయంతో నారాయణ ఇక ఎన్నికల సమరంలోకి దూకినట్లు రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.


Next Story