విద్యా సంస్థల బంద్ విజయవంతం

by Dishafeatures2 |
విద్యా సంస్థల బంద్ విజయవంతం
X

దిశ, నెల్లూరు సిటీ: విద్యార్థి కంటక రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దదించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు హెచ్చరించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. నెల్లూరు విఆర్సీ సెంటర్లో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్దానం చోటుచేసుకుంది. రాస్తారోకో విరమించాలని పోలీసులు విద్యార్థి సంఘ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అమృల్లా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి చైతన్య, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సునీల్, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి షఫీ హారన్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 84 లక్షల మంది అమ్మ ఒడికి అర్హులుగా ఉండగా, 44 లక్షల మందికి మాత్రమే 2000 కోత వేసి ఇస్తున్నారని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మ ఒడి ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళ లో కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచకుండా నాలుగేళ్లుగా కాలయాపన చేసిందని తెలిపారు. జీవో నెంబర్ 82 ను రద్దుచేసి విద్యార్థుల గొంతు కోసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా దీవెన పేరుతో కేవలం 10 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, అది కూడా మూడు విడతల అసలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వసతి దీవెన పథకం అర్హులకు నాలుగు విడతల సాయం నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను వైసిపి ప్రభుత్వం ఎత్తివేసి వారిని రోడ్లపాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకంతో సుమారు రెండు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్స్ కళాశాల యాజమాన్యాల వద్ద ఉండిపోయాయని అక్రమ వ్యక్తం చేశారు. టీచర్ పోస్టుల భర్తీ నిలిపివేసి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలతో 3.9 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలులో ఉండేదని, వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక మధ్యాహ్నం భోజనాన్ని రద్దుచేసి విద్యార్థుల కడుపుల మాడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి కంటక విధానాలను అమలు చేసి లక్షల మంది విద్యార్థులను వీధులు పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అసమర్ధ ప్రభుత్వాన్ని సాగనంపేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్బి జిల్లా అధ్యక్షుడు రాకేష్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు నసీం, అక్షయ్, లీల, శివం, స్వరూప్, షేక్ వసీం, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed