అంకెల ముచ్చట్లు.. ఉత్తుత్తి కేటాయింపులు

by Dishanational1 |
అంకెల ముచ్చట్లు.. ఉత్తుత్తి కేటాయింపులు
X

రాష్ట్ర శాసనసభలో గురువారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంకెల గారడీతో సాగింది. కేటాయింపుల్లోనూ స్పష్టత కరువైంది. నీటి పారుదల రంగానికి కేటాయింపులు కంటి తుడుపుగానే ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి అంటూ పలికిన ప్రగల్బాలు సరిపడా కాసులు విదల్చలేదు. రైతే తమకు ప్రథమ ప్రాధాన్యమని చెప్పిన మాటలు నీటిమూటలే అయ్యాయి. చివరికి బుగ్గన బడ్జెట్ రాయలసీమ ప్రాంతానికి రాళ్లే మిగిల్చిందని పలువురు ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.

దిశ, కడప: ఎంతో ఆర్భాటంగానూ, మరెంతో గొప్పగానూ చెప్పుకున్న రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల మాయగా మారింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రాయలసీమకు అన్యాయం జరిగింది. కడప జిల్లా ప్రగతి చోదక శక్తులు అయిన ఇరిగేషన్, వ్యవసాయం, పారిశ్రామిక, సేవ రంగాలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయలేదు. జిల్లాలో ఉక్ కుకర్మాగారం ఏర్పాటు కు రూ. 2,200 కోట్లు, పులివెందులలో ముర్ర జాతి గేదెల ఉత్పత్తి, కొప్పర్తి పారిశ్రామిక వాడ, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన, రాయచోటిలో పారిశ్రామిక శిక్షణా సంస్థ వంటి పేర్లతో ఊరట కలిగించే ప్రయత్నం చేశారు.

స్పష్టత కరువు

నిధుల కేటాయింపుల వివరాల్లో స్పష్టత కనిపించకపోవడం నిరుత్సాహం కలిగించింది. జిల్లాలో సాగునీటి పారుదల, పారిశ్రామిక రంగాల కేటాయింపులను పరిశీలిస్తే మొక్కుబడిగా కేటాయింపులు తలపించాయని చెప్పవచ్చు. రాష్ట్ర బడ్జెట్ 2023 -24 ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రూ. 2,79,279 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇందులో జిల్లాకు సంబంధించిన కేటాయింపులు ఏ రంగాన్నీ అభివృద్ధి వైపు నడిపించేలా లేవని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి రంగాల కేటాయింపులను పరిశీలిస్తే జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్, కేసీ కెనాల్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో ముడిపడి ఉండడంతో స్పష్టత లోపించింది. గతేడాది జీఎన్ఎస్ఎస్ కు రూ.439.30 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 855.35 కోట్లకు పెంచారు. పీబీసీకి గతేడాది రూ.238.95 కోట్లు కేటాయించగా తాజాగా రూ.106.59 కోట్లు విదిల్చారు. హెచ్ఎన్ఎస్ కు రూ.122.69 కోట్లు, వెలిగళ్లకు రూ.1.5 కోట్లు, చెయ్యేరుకు రూ.20 లక్షలతో సరిపెట్టారు. ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపులు పెంచినట్లు చూపించి జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం.. పెరిగిన ఖర్చులకు తగినట్లు కేటాయించలేదనే విషయం స్పష్టమవుతోంది.

ఉత్తుత్తి కేటాయింపులు

గత బడ్జెట్ లో సాగునీటి పారుదల రంగానికి రూ. 807 కోట్లు కేటాయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ లో రూ.1,542.17 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెంచినా ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పరిశీలిస్తే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రూ. 2,200 కోట్లు కేటాయించారు. కొప్పర్తి వైఎస్సార్ మ్యాన్ ఫ్యాక్చ రింగ్ క్లస్టర్ లో పరిశ్రమల ఏర్పాటుతో 35 వేల ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులకు ఆశల వల వేశారు. పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, పులివెందులలో వెటర్నరీ బయోలాజికల్ ఇనిస్టిట్యూట్ లో ముర్ర జాతి గేదెల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు..

యోగి వేమన వర్సిటీకి రూ.32.83 కోట్లు

యోగివేమన యూనివర్సిటీకి రూ.32.83 కోట్లు, సీపీ బ్రౌన్ వర్సిటీ రూ.10 లక్షలు చొప్పున కేటాయించారు. జిల్లాలోని 4.80 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా రూ.500 కోట్లతో సున్నా వడ్డీ పథకం కింద లబ్ది పొందనున్నట్లు ప్రకటించారు. జిల్లా సర్వజన ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. అయితే ఉమ్మడి జిల్లాలోని అన్నమయ్య, పించా, ఎల్ఎస్పీ, కుందు, పెన్నా, కాలేటి వాగు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కేటాయింపుల ప్రస్తావన చేయకపోవడం విస్మయాన్ని కలిగించింది.

Next Story

Most Viewed