పీకల్లోతు అప్పుల్లో సామాన్యులు

by Dishanational1 |
పీకల్లోతు అప్పుల్లో సామాన్యులు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రతి మంగళవారం ప్రభుత్వం అప్పుల కోసం ఆర్బీఐ దగ్గర మోకరిల్లుతోంది. దొరికిన చోటల్లా వదలకుండా రుణాలు తెస్తోంది. చివరకు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా పీకల్లోతు అప్పుల్లో మునిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ సర్వే వెల్లడించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి లక్షమందిలో 46,330 మంది రుణగ్రస్తులున్నారు. అందులో గ్రామీణ మహిళలే ఎక్కువగా అప్పుల ఊబిలో మునిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. పాలక ప్రభుత్వం మాత్రం తాము మహిళా సాధికారత సాధించామని గొప్పలకు పోతోంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటూ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్​ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రజల దయనీయ స్థితికి కేంద్ర సర్వే ఫలితాలు అద్దం పడుతున్నాయి.

అత్యధిక రుణగ్రస్తులు రాష్ట్రంలోనే...

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రుణగ్రస్తులపై కేంద్ర గణాంకాల శాఖ సర్వే చేసింది. 2020 జనవరి నుంచి డిసెంబరుదాకా సర్వే చేయాలని నిర్ణయించింది. కరోనా కారణంగా 2021 ఆగస్టు 15 వరకు సర్వేను కొనసాగించారు. దేశ వ్యాప్తంగా 8,469 గ్రామాలు, 5,797 పట్టణాలను ఎంపిక చేసుకుంది. మొత్తం 2,76,409 కుటుంబాల నుంచి డేటా సేకరించింది. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే దేశ వ్యాప్తంగా అత్యధిక రుణగ్రస్తులు రాష్ట్రంలోనే ఉన్నట్లు స్పష్టమైంది. రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఏపీ కన్నా తెలంగాణలో 17% తక్కువ రుణగ్రస్తులున్నట్లు తేలింది. జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే రాష్ట్రంలో 193% మంది అప్పులపాలయ్యారు. పొరుగునున్న తెలంగాణలో 148 శాతం ఉన్నారు.

రుణాల ఊబిలో గ్రామీణ మహిళలు

రాష్ట్రంలో అర్బన్​కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా రుణాల ఊబిలో కూరుకుపోయారు. అందులో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 51.49 % ఉంటే పురుషుల్లో 46.61 % ఉన్నారు. అర్బన్​ మహిళల్లో 35.38 %, పురుషుల్లో 45.16 % రుణాలు తీసుకున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ డేటా సేకరించే నాటికి రూ.500 మించి అప్పు చేసి తీర్చలేని బకాయిలనే పరిగణనలోకి తీసుకున్నారు. సహకార సొసైటీలు, బ్యాంకులు, పీఎఫ్, బీమా సంస్థలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను సంస్థాగత రుణాలుగా పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారులు, బంధువులు, మిత్రుల నుంచి తీసుకున్న అప్పులను అసంఘటిత రంగాల నుంచి తీసుకున్న రుణాలుగా నమోదు చేశారు.

అప్పులతో ఆందోళన

మహిళా సాధికారత సాధించామని చెప్పుకునే వైసీపీ సర్కారు పాలనలో మహిళలు ఇంత పెద్ద ఎత్తున రుణాల ఊబిలో చిక్కుకుపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ నగదు బదిలీ పథకాల్లో మహిళలకే ప్రాధాన్యమిస్తోంది. అయినా ఇంత పెద్ద ఎత్తున అప్పులపాలవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, వ్యవసాయంలో కౌలు సాగుతో నష్టాలు రావడం వల్లే అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఈ అప్పుల ముందు ఎందుకూ కొరగానట్లే కనిపిస్తోంది. రుణాలు తిరిగి చెల్లించాలంటే స్థిరమైన ఉపాధి, ఆదాయాన్ని పెంచేట్లు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.



Next Story