Ap News: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజీ

by Disha Web Desk 16 |
Ap News: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజీ
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల మధ్య పద్నాల్గవ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రప్రభుత్వ హామీ పరిస్థితి ఏంటని రాజ్యసభలోఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు. పదిహేనవ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపారు. కొత్తగా జమ్మూ, కాశ్మీర్‌ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు చెప్పారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.


‘కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 90:10 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించడం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలో ఒక అంశం. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లించడం ప్యాకేజీలో ప్రధాన అంశం.’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


Next Story

Most Viewed