బియ్యం ధరల రెక్కల‌కు బ్రేక్.. రూ.50 నుంచి రూ.52కే విక్రయం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

బియ్యం ధరల రెక్కల‌కు బ్రేక్.. రూ.50 నుంచి రూ.52కే విక్రయం
X

దిశ‌, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రైతు బజార్లు, ప్రభుత్వ విక్రయ కేంద్రాల ద్వారా నిర్ణీత ధరలకు బియ్యం విక్రయించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేర‌కు ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రైతు బజార్లు, ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో బీపీటీ, కేఎన్‌ఎం ( స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, పచ్చి బియ్యాన్ని (రా రైస్) కిలో రూ.50కు విక్రయించనున్నారు.

ఈ చర్యతో మార్కెట్లో బియ్యం ధరలు నియంత్రణలోకి రావడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి సహకారం అందిస్తామని, నిర్ణయించిన ధరలకే బియ్యం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రికి హామీ ఇచ్చారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలపై ధరల భారం పడకుండా చూడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేస్తే మార్కెట్లో ధరలు స్థిరపడటంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story