ఎమ్మెల్సీ ఓటర్లకు వెండి బిస్కెట్లు

by Dishanational2 |
ఎమ్మెల్సీ ఓటర్లకు వెండి బిస్కెట్లు
X

దిశ, ఉత్తరాంధ్ర: ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ప్రలోభాలకు ప్రజా ప్రతినిధులు సిద్ధమైపోతున్నారు. అధికార పార్టీ వైసీపీ బలపరిచిన అభ్యర్థి సీతమ్మ రాజు సుధాకర్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆర్‌కె బీచ్‌లోని మెజిస్టిక్‌ టవర్‌లో తన ఆఫీస్‌ అయిన 101 ప్లాట్‌లో పెద్దఎత్తున వెండి బిస్కట్లను సిద్ధం చేశారనే సమాచారంతో పీడీఎఫ్ బృందం సభ్యులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి, ఎన్నికల అబ్జర్వర్‌కి, పోలీస్‌ కమిషనర్‌‌కు అధికార పార్టీ అభ్యర్థి పై వెంటనే చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్‌ బృందం సభ్యులు డిమాండ్ చేశారు. వెండినాణేలు దాచిపెట్టిన రూంను చూపినా ఎన్నికల అధికారులు, పోలీసులు స్పందించలేదని 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారాం ఆరోపించారు.

శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఫిర్యాదు చేస్తే మహారాణి పేట తహశీల్ధార్‌ 7.30 గంటలకు పోలీస్‌లతో వచ్చారని డాక్టర్ బి. గంగారం తెలిపారు. వచ్చిన తరువాత కనీసం 101 ప్లాట్‌కు రమ్మన్నా రాకుండా అపార్టుమెంట్‌ గేటు ముందే ఉండిపోయారని ఆయన ఆరోపించారు. కంప్లైంట్‌ ఇచ్చిన తమను బలవంతంగా అపార్టుమెంట్‌ దగ్గర నుంచి బయటకు పోలీసులు పంపించి వేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ మీరు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు తిరిగి మమ్మల్ని హెచ్చరించారని ఆయన తెలిపారు. అక్కడ నుంచి వెళ్ళకపోతే అరెస్టులు చేస్తామని బెదిరించారన్నారు. తహశీల్ధార్‌, పోలీసులు గేటు దగ్గరే ఉండి 101 ప్లాట్‌కు కొంతమందిని లోపలకు పంపి ప్లాట్‌లో వేల సంఖ్యలో ఉన్న వెండి ఆభరణలను వేరే ప్రాంతానికి కారులో తరలించి అధికార పార్టీ అభ్యర్థికి సహకరించారని ఆయన ఆరోపించారు. వెండి బిస్కెట్లు ఒక్కొక్క ఆభరణం 15 గ్రాములు ఉంటుందని ఆయన తెలిపారు.

గతంలో ఏయూ వీసీ ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం పెట్టి దొరికిపోయినా ఆయనపై ఎటువంటి చర్యలు లేవన్నారు. ఇప్పుడు ఏకంగా వెండి, డబ్బులు పంపిణీకి సిద్ధమవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. పట్టభద్రులందరూ వైసీపీ అక్రమాల తాయలాలను, డబ్బుపంపిణీని తిరస్కరించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పీడీఎఫ్‌ అభ్యర్ధి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ కోరారు.


Next Story

Most Viewed