OMC కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్.. రివిజన్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-25 07:04:30  IST  )

ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసులో IAS అధికారిణి శ్రీలక్ష్మి (Sri Lakshmi)కి ఊహించని షాక్ తగిలింది.

OMC కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్.. రివిజన్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ IAS అధికారిణి శ్రీలక్ష్మి (Sri Lakshmi)కి ఊహించని షాక్ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం ఇప్పటికే నిందితురాలిగా తేల్చింది. కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ చేపట్టనుంది. అయితే, కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని డిశ్చార్జి పిటిషన్‌ను 2022 అక్టోబరులో సీబీఐ కోర్టు కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మి పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. అనంతరం ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ.. సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయడం సరికాదని కామెంట్ చేసింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ ఆ పిటిషన్‌ను తిరిగి హైకోర్టుకు బదిలీ చేసి మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది.

ఈ మేరకు ఇవాళ రెండో సారి ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. కాగా, సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్‌ కపాటియా (Srinivas Kapatia) వాదనలు వినిపించారు. ఓంఎసీకి అక్రమంగా మైనింగ్‌ లీజు అప్పగించారని కోర్టుకు తెలిపారు. ఓఎంసీకి లీజు కేటాయించేలా శ్రీలక్ష్మి చొరవతీసుకున్నారని ఆరోపించారు. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి మాత్రమే లీజు మంజూరయ్యేలా చూశారని ధర్మాసనానికి తెలిపారు. ఆమె అక్రమాలకు పాల్పడ్డారని అనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని, సాక్ష్యాధారాలు పరిశీలించాకే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు (CBI Court) తీర్పును వెలువరించిందని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కేసులో సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), కృపానందం‌కు ఊరట కల్పించారని.. తనకు కూడా కేసు నుంచి విముక్తి కల్పించాలనుకోవడం సరికాదని, శ్రీలక్ష్మి రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ మేరుకు ఇరు పక్షా వాదనలు విన్న ధర్మాసనం శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది.

Next Story