రాష్ట్రంలో ఎండలు భగభగ: 46 మండలాలకు వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-20 14:28:32  IST  )

రాష్ట్రంలో ఎండలు, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోన్‌క్లిక్ ప్రకర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు....

రాష్ట్రంలో ఎండలు భగభగ: 46 మండలాలకు వార్నింగ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోన్‌క్లిక్ ప్రకర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

వడగాల్పుల అంచనా:

మంగళవారం: రాష్ట్రవ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది.బుధవారం: ఎండల ప్రభావం మరింత పెరిగి, 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రపై అధిక ప్రభావం:

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. సోమవారం రాష్ట్రంలోని 289 మండలాల్లో 40 శాతం డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, పలుచోట్ల 43 శాతం డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రజలకు సూచనలు - జాగ్రత్తలు:

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది:అవసరమైతే తప్ప బయటకు రావద్దు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) ఉన్నవారు ఎండలో తిరగకూడదు.డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి నీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

కొన్ని జిల్లాల్లో వర్ష సూచన:

ద్రోణి ప్రభావంతో మంగళవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం) జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడవచ్చు.

హెచ్చరిక:

ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని రైతులకు, పశుకాపరులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story