రాజకీయ నిరసనకు బడిపిల్లలు.. ఆలస్యంగా వెలుగులోకి సంచలన ఘటన

by Jakkula.Mamatha |

జిల్లా కలెక్టరేట్​ వద్ద జరిగిన ఆందోళనకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్లారు.

రాజకీయ నిరసనకు బడిపిల్లలు.. ఆలస్యంగా వెలుగులోకి సంచలన ఘటన
X

దిశ, డైనమిక్​ బ్యూరో: జిల్లా కలెక్టరేట్​ వద్ద జరిగిన ఆందోళనకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంత్రి నారా లోకేష్​ స్పందించి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే .. నిన్న అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఫీజు పోరు పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌కు చెందిన విద్యార్థులను కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనకు ఆ పార్టీ నేతలు తీసుకు వెళ్లారని శ్యామ్​అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేష్​ను ఉద్దేశించి ఓ ట్వీట్​ చేశారు.

నిన్న, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారని తెలిపారు. ఎంఈవో, హెచ్​ఎం కూడా ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించడం ఆశ్చర్యకరం అని పేర్కొన్నారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రిలో చేరారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉందన్నారు. ఎంఈవో, హెచ్​ఎం బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం అని ఆయన తెలిపారు. ఈ ఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించ రాదని సూచించారు.

ఈ ట్వీట్​కు వెంటనే నారా లోకేష్​ స్పందించారు. ‘ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. ’ అని ఆయన ఎక్స్​వేదికగా ప్రకటించారు. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం అన్నారు. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకోవద్దు అని ఆయన అన్నారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నారా లోకేష్​ పేర్కొన్నారు.

ట్వీట్

Next Story