చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి : జైలు అధికారులకు ఏసీబీ న్యాయమూర్తి ఆదేశం

by Disha Web Desk 21 |
చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి : జైలు అధికారులకు ఏసీబీ న్యాయమూర్తి ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు జైల్లో అన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతోపాటు తగిన భద్రతనూ కల్పించాలని సూచించారు. అలాగే చంద్రబాబుకు ఇంటి నుంచి వచ్చిన ఆహారం, ఔషధాలను మాత్రమే అనుమతించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతకుముందు జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా పిటిషన్‌ దాఖలు చేశారు. ‘మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉంది. చంద్రబాబు వయసు, అనారోగ్యాల దృష్ట్యా వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు. కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి’ అని సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విజ్ఞప్తిపై స్పందించిన న్యాయమూర్తి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

Next Story

Most Viewed