సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

by Disha Web Desk 21 |
సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసే వేలాది మంది భ‌క్తుల‌కు తిరుప‌తిలో మ‌రింత సౌక‌ర్య‌వంతంగా వ‌స‌తి క‌ల్పించేందుకు టీటీడీ అచ్యుతం, శ్రీ‌ప‌థం వ‌స‌తి స‌మూదాయాలు నిర్మిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి(రెండు), శ్రీ కోదండ‌రామస్వామి(మూడు) సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈవో ఏవీ ధర్మారెడ్డి తో కలసి శుక్రవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా భూమన మీడియాతో మాట్లాడారు.‘ సామాన్య‌ భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, అన్నప్ర‌సాదం, బ‌స వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భ‌క్తుల‌కు మ‌రింత మెరుగ్గా బ‌స క‌ల్పించ‌డంలో భాగంగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవ‌స‌ర‌మైన వాటిని ఆధునీక‌రిస్తున్న‌ట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో దాదాపు 70ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్ల‌తో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింద‌న్నారు. ఒక్కో బ్లాకులో 4100 మంది చొప్పున మొత్తం 8200 మంది భ‌క్తులు ఇక్క‌డ‌ బ‌స చేసే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఇందులో దాదాపు 200కు పైగా కార్లు, ద్విచ‌క్ర‌వాహ‌నాలు పార్కింగ్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి

ఒక్కో బ్లాక్‌ను 7.04 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగు విస్తీర్ణంలో ఎనిమిది ఫ్లోర్ల‌తో నిర్మిస్తామ‌ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. మొద‌టి ఫ్లోర్‌లో రిసెప్ష‌న్‌, ఎస్ఎస్‌డి టోకెన్ కౌంట‌ర్లు, మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు వేరువేరుగా జ‌న‌ర‌ల్ టాయిలెట్లు, మెడిక‌ల్ డిస్పెన్స‌రీ, కార్యాల‌య గ‌దులు, రెండు రెస్టారెంట్లు, శ్రీ‌వారి సేవ‌కుల కోసం ఐదు హాళ్లు, స్టోర్ రూమ్ ఉంటాయ‌న్నారు. రెండు, మూడు ఫ్లోర్ల‌లో అన్నప్ర‌సాదం హాలు, 500 మంది యాత్రికులు బ‌స చేసేందుకు వీలుగా 23 డార్మిట‌రీ హాళ్లు, జ‌న‌ర‌ల్ టాయిలెట్లు నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. నాలుగో ఫ్లోర్ నుండి ఎనిమిదో ఫ్లోర్ వ‌ర‌కు ఒక్కో ఫ్లోర్‌లో 8 ఫ్యామిలీ సూట్ రూమ్‌లు, 100 గ‌దులు, మొత్తం 540 గ‌దులు ఉంటాయ‌ని చెప్పారు. వీటిని మూడు సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధిలో ఈ నిర్మాణాల‌ను పూర్తి చేస్తామ‌ని ఛైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి వివ‌రించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయ‌ర్ అభిన‌య్ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ (ఎల‌క్టిక‌ల్‌) వెంక‌టేశ్వ‌ర్లు, ఈఈ వేణుగోపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed