జగన్ సర్కార్ జారీ చేసిన ఆ జీవోను కొట్టేయండి..ఏపీ హైకోర్టులో పిల్

by Disha Web Desk 3 |
జగన్ సర్కార్ జారీ చేసిన ఆ జీవోను కొట్టేయండి..ఏపీ హైకోర్టులో పిల్
X

దిశ వెబ్ డెస్క్: గతంలో కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చిన విషయం అందరికి సుపరిచితమే. అయితే ఆ సమయంలో కోనసీమ జిల్లా పేరును మార్చడానికి వీలు లేదంటూ అనేక అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో వందలాది మంది పైన పోలీసులు కేసులు బుక్ చేశారు. కాగా ఆ కేసులను ఉపసంహరిస్తూ ఏపీ అధికార ప్రభుత్వం 2023 డిసెంబరు 20న జీవో 1566 జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్‌ జంగా బాబూరావు సోమవారం ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ నిమిత్తం జారీ చేసిన జీవో 1566 సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని.. కనుక ఆ జీవో అమలు కాకుండా నిలిపివేయాలని ఏపీ హైకోర్టును కోరారు. ఇక ఈ లిటిగేషన్ లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ, డీఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇక అమలాపురంలో పోలీసులపై రాళ్లదాడి కి పాల్పడి.. మంత్రి, అధికార పార్టీ నేతల ఇళ్లకు నిప్పుపెట్టి హత్యా యత్నం చేసి 2022 మే నెలలో చోటు చేసుకున్న ఈ హింసాత్మక ఘటనలకు కారకులైన వందలాది మంది పై పోలీలీసులు కేసు నమోదు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన పిటిషనర్‌.. నిందితులపై ఐపీసీ 307(హత్యాయత్నం) వంటి కీలక సెక్షన్లు ఉన్నాయని గుర్తు చేస్తూ.. తీవ్ర నేరాల్లో నిందితులపై ఉన్న కేసులను ఉపసంహరించడానికి చట్టం అనుమతించదన్నారు. ఇక కేసులను ఉపసంహరించుకుంటూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను జీవోలో పేర్కొనలేదని తెలిపారు. కనుక ఆ జీవోని కొట్టెయ్యాల్సిందిగా కోరారు.



Next Story

Most Viewed