ఆ రెండు నియోజకవర్గాలు చంద్రబాబు జనసేనకే వదిలేశారు.. ఇదంతా కొత్త డ్రామా!

by Disha Web Desk 2 |
ఆ రెండు నియోజకవర్గాలు చంద్రబాబు జనసేనకే వదిలేశారు.. ఇదంతా కొత్త డ్రామా!
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ కామెంట్స్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ శుక్రవారం పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేయబోయే రెండు అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. దీనిపై పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జులనే నియమించలేదని అన్నారు.


ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు ఎప్పుడో జనసేనకు వదిలేశారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా అభ్యర్థులను ప్రకటించినట్లు డ్రామాలు ఆడుతూ మరో కొత్త డ్రామా తెరమీదరకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు, జనసైనికుల్లో వస్తున్న వ్యతిరేకతను చల్లార్చేందుకే పవన్ అభ్యర్థులను ప్రకటించారని విమర్శించారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదంతా కేవలం ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ అని అన్నారు. కాగా, ఈ ఉదయం టీడీపీకి కౌంటర్‌గా ఇద్దరు అభ్యర్థులను పవన్‌ ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేనే పోటీ చేస్తుందని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని వివరించారు. చంద్రబాబుకు ఉన్నట్టే నాకూ ఒత్తిడి ఉందన్నారు. పొత్తు ఇబ్బందికరమే.. కానీ టీడీపీతోనే కలిసి వెళ్తాం అని తేల్చి చెప్పారు. పొత్తులో ఉన్నప్పుడు ఒక మాట ఎక్కువా తక్కువా ఉంటుందని, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా టీడీపీతో ముందుకెళ్తామన్నారు. జనసేన పోటీచేసే స్థానాలపై పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed