Anna Canteens: ‘పీపుల్స్ పల్స్’ సర్వేలో షాకింగ్ విషయాలు

by srinivas |   ( Updated:2025-01-20 10:39:43.0  )
Anna Canteens: ‘పీపుల్స్ పల్స్’ సర్వేలో షాకింగ్ విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి మనిషికి ఆహారం అనేది కనీస అవసరం. పలు నివేదికల ప్రకారం మన దేశంలోని పట్టణాలు, టౌన్లలో నివసించే అనేకమందికి అవసరమైన ఆహారం దొరక్క ఆకలితో జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగావారికి పోషకాహారం అందడం లేదు. ఈ ఆకలి, పోషకాహారలోపం సమస్యలకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘అన్న క్యాంటీన్ పథకం’’ తీసుకొచ్చింది. కేవలం 15 రూపాయిలకే మూడు పూటల భోజనం అందిస్తున్న ఈ ‘‘అన్న క్యాంటీన్స్’’ పని తీరుపై పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సందర్శించి చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

పథకంపై లబ్ధిదారుల అభిప్రాయం


అన్న క్యాంటీన్ల(అన్న Canteens)లో అందిస్తున్న భోజనం(Meals) నాణ్యత, పరిశుభ్రత, మౌలిక సౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తనతో పాటు పథకంపై లబ్ధిదారుల అభిప్రాయం తెలుసుకోవడానికి చిత్తూరు(Chittoor) నుంచి శ్రీకాకుళం(Srikakulam) వరకు...రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక క్యాంటీన్ చొప్పున మొత్తం 25 అన్న క్యాంటీన్లను పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ రీసెర్చర్లు సందర్శించి అధ్యయనం చేయడం జరిగింది. ఈ రీసెర్చ్లో భాగంగా ప్రతి క్యాంటీన్వద్ద 50 నుంచి 60 మంది లబ్దిదారులతో ముఖాముఖి చర్చించి, దాదాపు 1200 మందితో మాట్లాడి ఈ పథకాన్ని క్షుణ్ణంగా రీసెర్చర్లు అధ్యయనం చేశారు. ఈ రీసెర్చ్లోభాగంగా ఒక్కొక్క క్యాంటీన్ వద్ద మా రీసెర్చర్లు కనీసం నాలుగు గంటల సమయాన్ని వెచ్చించి, ఆయా క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పథకాన్ని వినియోగించుకుంటున్న లబ్దిదారులతో మాట మంతీ చేస్తూ... వారి నుంచి సమగ్ర సమచారాన్ని సేకరించింది. 3 నుంచి 10 జనవరి, 2025 వరకూ వారం రోజుల పాటు ఈ అధ్యయనం కొనసాగింది. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ సీనియర్ రీసెర్చర్ శ్రీ జి.మురళీకృష్ణ నేతృత్వంలో మొత్తం 10 మంది రీసెర్చర్లు క్షేత్రస్థాయిలో ఈ సర్వే నిర్వహించారు.

అన్న క్యాంటీన్ల నిర్వాహణపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో ప్రధానంగా ఈ కింది అంశాలపై దృష్టి సారించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది.

ఎ. భోజనం నాణ్యత

బి. సిబ్బంది ప్రవర్తన, సమయపాలన

సి. పరిశుభ్రత

డి. ఈ పథకాన్ని ఎవరు ఎక్కువ వినియోగించుకుంటున్నారు?

ఈ. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ది చేకూరుతోందా?

ఎఫ్. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం ఉన్న లోపాలేమిటి?

ఈ అభిప్రాయాల ఆధారంగా అన్న క్యాంటీన్ పథకం మరింత మెరుగ్గా అమలు చేయడానికి పలు సూచనలను, నిపుణులనుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి, ఈ నివేదికను రూపొందించాం. తెలుగుదేశం ప్రభుత్వం 2018, జూలైలో పట్టణ ప్రాంతాల్లో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద ఈ ‘అన్న క్యాంటీన్ల’ను ప్రారంభించింది. రాయితీ మీద ఒక పూటకు రూ.5లకే ఆహారంఅందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ క్యాంటీన్లలో 15రూపాయిలకుఉదయం టిఫిన్, మధ్యాహ్నా భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉన్నాయి. అంటే 15 రూపాయిలకే మూడు పూటల పేదవాడి కడుపు నింపడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, టౌన్లలో మొత్తం 204 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను ‘అక్షయపాత్ర’ అనే ఎన్జీవోకు అప్పగించారు. ఇస్కాన్ వారు నడిపించే ఈ ఎన్జీవోకు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఆహారం తయారుచేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారు. ముందురోజు డిమాండ్ని బట్టి అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ తమ కిచెన్ల నుంచి ఆహారాన్ని అన్న క్యాంటీన్లకు సప్లయ్ చేస్తోంది. డిమాండ్, ప్రాంతాలను బట్టి ఒక్కో అన్న క్యాంటీన్ 300 నుంచి 500 మంది పేదలకు కడుపు నింపుతున్నాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఉదయం టిఫిన్కు రూ.22, ఒక పూట భోజనానికి 34 రూపాయల చొప్పున ఖర్చు అవుతోంది. అంటే మూడు పూటలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మొత్తం రూ.90. ఇందులో లబ్దిదారుల నుంచి 15 రూపాయిలు వసూలు చేస్తారు. మిగిలిన 75 రూపాయిలు ప్రభుత్వం రాయితీగాఇవ్వడంతో పాటు కొంతమంది దాతల ద్వారా సమకూర్చి అక్షయపాత్రకు చెల్లిస్తోంది. ఒక్కో క్యాంటీన్ నడపడానికి ప్రభుత్వానికి రోజుకు రూ.26,256 ఖర్చు అవుతుండగా, మొత్తం క్యాంటీన్ల నిర్వాహణకు రోజుకు దాదాపు రూ.53 లక్షలు ఖర్చు చేస్తోంది. అంటే సంవత్సరానికి రూ.200 కోట్ల రూపాయిలు వెచ్చిస్తోంది.

2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ‘‘అన్న క్యాంటీన్ల’’ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలిపివేసింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ‘‘రాజన్న క్యాంటిన్ల’’ను ప్రారంభించి పేదలకు ఆహారాన్ని అందించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో 2024, ఆగస్టు 15వ తేదీన మళ్లీ ఈ క్యాంటీన్లు పున:ప్రారంభమయ్యాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒక ఆసక్తి విషయం తెలిసింది. 2024 ఎన్నికలకు ముందు పలుచోట్ల టీడీపీ నాయకులు నడిపిన ప్రయివేట్ అన్న క్యాంటీన్లలో అందించిన ఆహారంతో పోలుస్తూ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న అన్న క్యాంటీన్ల ఆహారం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రుచి మారాలి...

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉప్పూ కారం ఎక్కువగా తింటారు. కానీ, అన్న క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాల్లో ప్రజలు కోరుకుంటున్న జిహ్వకు తగ్గట్టుగా ఉప్పూ కారం సరిగ్గా ఉండటం లేదని 80 శాతంమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనంలో ఒక కర్రీ, సాంబార్ ఉండాలి. కానీ, రెండు సాంబర్లే ఇస్తున్నారేంటి? అన్నట్టుగా కర్రీ కూడా నీళ్లలాగా ఉంటోంది. ఉదయం టిఫిన్లలో అందిస్తున్న చట్నీ కూడా బాగుండటం లేదు. చెడిపోయి, వాసన వస్తోంది. భోజనానికి ఇచ్చే చట్నీ క్వాలిటీగా ఉండటం లేదు. క్యాంటీన్లలో భోజనం చేసేవారు రోటి పచ్చడి కూడా పెట్టాలని కోరుకుంటున్నారు. రుచి తగ్గడానికి మరో కారణం... క్యాంటీన్లకు వచ్చేసరికి ఆహారం చల్లగా మారుతోంది. చాలా క్యాంటీన్లలో హాట్ బాక్స్లు లేవు.

అన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజు వచ్చిన నాయకులు తర్వాత రావడంలేదు. నాయకులు వస్తున్నారనిముందే సమాచారం ఇస్తుండటంతో ఆ రోజు భోజనం రుచిగా, నాణ్యతగా తీసుకొస్తున్నారని, మిగతా రోజుల్లో ఆ రుచి ఉండటం లేదని జగదీశ్ అనే విజయనగరం యువకుడు చెప్పాడు. నాయకులు వస్తారని తెలిసి బాగా పెట్టడం కాకుండా, ప్రతి రోజూ క్వాలిటీగా పెట్టాలని విజయనగరంలోనే రాము అనే యువకుడు చెప్పాడు. కర్నూల్‌లో పెద్దపాటి శ్యామ్ అనే యువకుడు కూడా ఇంచుమించు ఇలాగేచెప్పాడు. అన్న క్యాంటీన్లలో ఆహారం రుచి రోజూ ఒకేవిధంగా ఉంటుంది. కూరగాయలు మారినా... వండే విధానం, రుచి మారడం లేదు. ‘‘కర్రీస్ మారిస్తే బాగుంటుందండీ. అస్తమానం ఒకే రకమైన కూరలు పెడుతున్నారు. రుచి కూడా ఏం మారడం లేదు’’ అని ఏలూరులో సాయితేజ చెప్పాడు. పదార్థాలు ఇంకొంచెం స్పైసీగా ఉండాలని కోరుకుంటున్నారు.

అల్పాహారం తీసుకుంటున్నవారిలో ఎక్కువమంది రెండు టోకెన్లు తీసుకోవడాన్ని మేం గమనించాం. అల్పాహారంలో అందిస్తున్న ఇడ్లీలు, పొంగల్, పూరీలు అంత క్వాలిటీగా ఉండటం లేదు. లబ్దిదారుల నుంచి కేవలం రూ.5 తీసుకుంటున్న ప్రభుత్వం రూ.17 ఇస్తున్నా... అల్పాహారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలలో బండ్ల మీద కేవలం రూ. 15 నుంచి 20కే 5 ఇడ్లీలు/ 4 పూరీలు/ ఉప్మా మంచి క్వాలిటీతో అందిస్తున్నారు. రూ.22 తీసుకుంటున్న ఏజెన్సీ అల్పాహారాన్ని మరింత నాణ్యతగా అందించవచ్చు. అదే విధంగా రాష్ట్రంలోని అనేక చోట్ల 20 నుంచి 25 రూపాయలకే లెమన్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, టమాటా రైస్, పెరుగన్నం మంచి క్వాలిటీతో అందిస్తున్నారు. అటువంటిది రూ.34 ఒక భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు ప్రస్తుతం అందిస్తున్న దానికన్నా మరింత క్వాలిటీతో భోజనం అందించవచ్చు.

క్వాంటిటీలో చేతివాటం

అన్న క్యాంటీన్లలో లంచ్, డిన్నర్కి 400 గ్రాముల రైస్, ఒక కప్పు కర్రీ, 120 గ్రాముల సాంబార్, 75 గ్రాముల పప్పు, పెరుగు, పచ్చడి, అల్పాహారంలో ఒక ప్లేట్ ఇడ్లీ/ పూరీ/ పొంగల్ వంటి ఐటమ్స్ అందిస్తున్నామని, ఇడ్లీ, పూరీ అయితే 3 చొప్పున ఇస్తామని.. ఉప్మా లేదా పొంగల్ అయితే 250 గ్రాముల అందిస్తున్నట్లు మెనూలో ప్రభుత్వం పేర్కొంది. దాదాపు మెనూ ప్రకారమే రోజూ ఐటెమ్స్ వస్తున్నాయి. కానీ, మెనూలో పేర్కొన్నట్టుగా క్వాంటిటీ ఇవ్వడం లేదు. ఇక్కడ సిబ్బంది చేతివాటం స్పష్టంగా కనపడుతోంది. రైస్ 400 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా... చాలాచోట్ల 350 గ్రాములకు మించి ఇవ్వడం లేదు. ఉదాహరణకు ఒక క్యాంటీన్కి 300 మందికి సరిపడా భోజనం పంపిస్తే, దానిని 350 మందికి పెట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అదనంగా 50 మందికి పెట్టిన భోజనానికి వచ్చే డబ్బులు సిబ్బంది జేబులోకి వెళ్తున్నాయి.

‘‘అన్న క్యాంటీన్లు బాగానేఉన్నాయి. కానీ, రూ.5కు వడ్డిస్తున్న భోజనం చిన్న పిల్లాడికి కూడా సరిపోదు.చాలా తక్కువగా వడ్డిస్తున్నారు. ఇదేమిటని అడిగితే, రూ.5కి ఇంతకు మించి రాదులే అని సిబ్బంది కసురుకుంటున్నారు’’అని గాజువాకలో మేము కలిసిన పవన్ కుమార్ చెప్పాడు. ఇంచుమించు ఇలాంటి మాటలే చాలా చోట్ల వినపడ్డాయి. రూ.5 ఒక టోకెన్ తీసుకున్నప్పుడు, అది ఒక వ్యక్తికి సరిపోకపోవడంతో, రెండు టోకెన్లు తీసుకుని భోజనం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా రూ.10 తీసుకుని కొంచెం క్వాలిటీ, క్వాంటిటీ పెంచితే బాగుంటుందని చాలామంది ఏకాభిప్రాయంగా వినిపించారు. తమ ఇంట్లో నుంచి తెచ్చి వడ్డిస్తున్నట్టుగా, లబ్దిదారులను చిన్నచూపు చూస్తున్న సిబ్బంది ప్రవర్తనను పీపుల్స్ పల్స్ రీసెర్చర్లు పరిశీలించారు.

శుభ్రత ఎలా ఉంది?

అన్న క్యాంటీన్ల శుభ్రత, నాణ్యత పట్ల 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ల శుభ్రతను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ, చాలా చోట్ల ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ప్రధాన లోపం. అన్న క్యాంటీన్లలో ఉపయోగించే ప్లేట్లను సబ్బు ఉపయోగించి, పరిశుభ్రమైన వేడి నీటితో శుభ్రం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ, వేడి నీళ్లతో కడుగుతున్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ప్లేట్లను శుభ్రంగా కడగకపోవడంతో ప్లేట్ల కింద మరకలు స్పష్టంగా కనపడుతున్నాయి. వాష్ బేషన్స్లోనూ మురికి అలాగే ఉంటుంది. టేబుల్స్ని కూడా సరిగ్గా క్లీన్ చేయడం లేదు. వడ్డించేటప్పుడు సిబ్బంది గ్లౌజులు వాడటం లేదు. తాగునీటి శుభ్రత విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

స్కీం బాగుంది

‘‘స్కీం బాగుంది. చాలామంది ఈ స్కీంని ఉపయోగించుకుంటున్నారు. కానీ, అన్న క్యాంటీన్లలో ప్లేట్లు సరిగ్గా కడగటం లేదు. క్యాంటీన్లో ఇంకా శుభ్రత పెరగాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల ఇక్కడ తిన్నవాళ్లలో చాలామందికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి’’ అని అనంతపురంలో రాజశేఖర్ అనే యువకుడు చెప్పాడు. మధ్య వయసు వారు శుభ్రత గురించి ఎక్కువ మాట్లాడటం లేదుగానీ, యువకుల్లో చాలామంది శుభ్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

సమయ పాలన పాటించడం లేదు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటలనుంచి 9 గంటలవరకు రాత్రి భోజనం కోసం తెరిచి ఉంచాలి. కానీ, చాలా క్యాంటీన్లలో సమయపాలన పాటించడం లేదు. అన్న క్యాంటీన్లు ఆలస్యంగా తెరుస్తున్నారు. దీంతో మధ్యాహ్న సమయంలో క్యూలో ఎక్కువ సమయం నించోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఒక టోకెన్ దొరకడానికి అరగంట నుంచి గంట వరకు క్యూలో ఇబ్బంది పడాల్సి వస్తోందని నెల్లూరులో అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న శ్రీనివాస్ అనే నిరుద్యోగి చెప్పాడు. ‘‘పన్నెండింటికీ స్టార్ట్ చేస్తామంటున్నారు. కానీ, ఒంటిగంట అవుతోందండి’’ అని ఏలూరులో అయ్యప్ప చెప్పాడు. సిబ్బంది పనివేళలను పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడమే సమయపాలనపాటించకపోవడానికి ప్రధాన కారణం. దీనిపై ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అన్న క్యాంటీన్లను ఉపయోగించుకుంటున్నది ఎవరు?

అన్న క్యాంటీన్లను ఉపయోగించుకుంటున్న వారిలో అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారే ఎక్కువ మంది ఉంటున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, నిరుద్యోగులు, వలస కూలీలు అధికంగా అన్న క్యాంటీన్ కి వస్తున్నారు. క్యాంటీన్లు అధికంగా ఆస్పత్రులు, బస్టాండులకు దగ్గరగా ఉండటం వల్ల చుట్టు పక్కల ఊళ్ల నుంచి టౌన్లకు వచ్చే రైతులు, ఆస్పత్రులకు వచ్చేవారి కుటుంబ సభ్యులు ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ఆస్పత్రులు, బస్టాండులకు దగ్గరగా క్యాంటీన్ల నిర్మాణం చేపట్టడం మంచి విషయమే.అన్న క్యాంటీన్లకు వస్తున్నవారిలో ఎక్కువమంది ఆదాయం నెలకు రూ.10,000వరకు మాత్రమే ఉంది. అన్న క్యాంటీన్లలోరిపిటెడ్ కస్టమర్లు ఎక్కువగా ఉంటున్నారు.

పీపుల్స్ పల్స్ బృందం కలిసిన వారిలో... వారానికి 3 నుంచి 5 రోజులు ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నవాళ్లు 56 శాతం మంది ఉన్నారు. మొదటిసారి తింటున్నామని చెప్పినవాళ్లు 34 శాతం మంది ఉన్నారు. వీరిలో దాదాపు 85 శాతం మంది మగవాళ్లే అన్న క్యాంటీన్లకు వస్తున్నారు. ఇందులోనూ అధిక శాతం మంది ఎస్సీలు, బీసీలే అని మా సర్వేలో తేలింది. ఎక్కువమంది మగవాళ్లే ఉండటం, ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవడం వల్ల మహిళలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ‘‘రైస్ కూడా సన్న బియ్యమే పెడుతున్నారు. క్వాలిటీ కూడా బాగుంది. కానీ, మహిళలకోసం ప్రత్యేకంగాక్యూ పెడితే బాగుంటుంది’’ అని విజయవాడ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న రమాదేవి చెప్పారు. ప్రత్యేకంగా మహిళల కోసం అన్న క్యాంటీన్ పెడితే బాగుంటుందని అభిప్రాయం కూడా పలుచోట్ల వ్యక్తమయ్యింది.

ఈ పథకాన్ని నిరుద్యోగ యువత దాదాపు 38 శాతం మంది వినియోగించుకుంటున్నారు. వీరిలో చాలామంది పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్నవారు, లైబ్రరీల్లో చదువుకుంటున్నవారు, పబ్లిక్వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు ఇందులో ఉన్నారు. ‘‘అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి ముందు, మేమే వంట చేసుకునేవాళ్లం. కర్రీ పాయింట్లలో కర్రీ తెచ్చుకునేవాళ్లం. అన్న క్యాంటీన్ల వల్ల మాకు ఆ బాధ తప్పింది, సమయం కూడా ఆదా అవుతోంది’’ అని విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న త్రినాథ్, వెంకటేశ్ చెప్పారు. అన్న క్యాంటీన్లకు ఆదివారం సెలవు తీసివేయాలని కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు, లైబ్రరీల్లో చదువుకుంటున్న విద్యార్థులు చెప్పడం పీపుల్స్ పల్స్ బృందం రికార్డ్ చేసింది.

సేవింగ్స్ పెరిగాయా?

అన్న క్యాంటీన్లో తినడం వల్ల తమ సేవింగ్స్ పెరిగాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని 45శాతంమంది చెప్పారు. ‘‘విజయవాడలో నాకు ఎక్కడ డ్రాప్ పడినా... టైంకు దగ్గరున్న అన్న క్యాంటీన్కి వెళ్లి భోజనం చేస్తాను. అన్ని చోట్లా ఒకే రుచి ఉంటుంది. ఈ క్యాంటీన్ వల్ల నాకు చాలా డబ్బు ఆదా అవుతోంది’’ అని విజయవాడలో ఆటో నడుపుతున్న నాగేశ్వర రావు చెప్పాడు. ‘‘నేను ఆటో నడిపితే రోజూ 500 నుంచి 600 వస్తాయి. వాటిలో టిఫిన్కి 30, 40 రూపాయిలు పెట్టాలి. భోజనానికి వంద రూపాయిలు పెట్టాలి. మేం ఈ అన్న క్యాంటీన్ వల్ల ఉదయం రూ.5, మధ్యాహ్నం రూ.5తో

కడుపు నింపుకుంటున్నాం. దీంతో డబ్బు కూడా మాకు ఆదా అవుతోంది’’ అని పాలకొల్లులో కృష్ణ చెప్పాడు. అన్న క్యాంటీన్లు వచ్చిన తర్వాత సోమరిపోతులుగా మారుతున్నారని, పని చేయడం మానేశారనేది కేవలం అపోహా మాత్రమే. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసినప్పుడు అక్కడ ఆహారం తీసుకుంటున్న 68 శాతంమంది తాముచేస్తున్న పనులగురించి మాతో పంచుకున్నారు.వైన్ షాపుల్లో మందుకు ఎక్కువ ఖర్చు పెట్టి, తక్కువ డబ్బులకు అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వారు కూడా ఉన్నారనేది వాస్తవం.

క్యాంటీన్లు మళ్లీ తెరవడంపై 75 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. ‘‘బయట టిఫిన్ చేయాలంటేనాకు 40, 50 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ అందించడం ఆనందంగా ఉందని ఎక్కువమంది చెప్పారు. ‘‘మేం ఎరువుల కోసం గుంటూరుకు వచ్చాం. తిరిగి వెళ్లిపోతూ అన్న క్యాంటీన్లో భోజనం చేశా. చాలా బాగుంది. అంతకముందు ఇంటికెళ్లేదాక ఖాళీ కడుపుతో ఉండేవాడిని. పేదలకు, ప్రయాణాలు చేసేవారికి ఉపయోగంగా ఉన్న ఈ క్యాంటీన్లు ఇలాగే కొనసాగించాలి’’ అని గుంటూరు బస్టాండు వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కలిసిన రైతు వెంకటేశ్వర్లు చెప్పారు.

అన్న క్యాంటీన్లు మరింత పటిష్టంగా నిర్వహించడానికి కొన్ని సూచనలు

  • పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో అన్న క్యాంటీన్లపై నిర్వహించిన సర్వేలో సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటే అన్న క్యాంటీన్లను మరింత పటిష్టంగా నిర్వహించడంతో పాటు ప్రజల మనసు కూడా గెలుచుకోవచ్చు.
  • అన్న క్యాంటీన్ల పర్యవేక్షణ, వాటి నిర్వాహణ కోసం ఒక ప్రత్యేక కార్పోరేషన్ని ఏర్పాటు చేయాలి. దీనికి ఒక ప్రత్యేక అధికారి నియామకంతో పాటు, ఈ కార్పోరేషన్ బాధ్యతలను ఒక ప్రజా ప్రతినిధికి లేదా సమర్థతగల నాయకుడికి అప్పగించాలి. ఈ కార్పోరేషన్లో కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, సంఘ సేవకులను కూడా డైరెక్టర్లుగా నియమించి, వీటి నిర్వాహణ బాధ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
  • అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్నవారు 5 రూపాయిలకే భోజనం వస్తుందని, 5 రూపాయిలకు ఇంతకంటే ఎక్కువేం పెడతారు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. వాస్తవానికి మూడు పూటలకు లబ్దిదారులు 15 రూపాయిలే చెల్లిస్తున్నా... ప్రభుత్వం మరో 75 రూపాయిలు చెల్లిస్తున్న విషయాన్ని లబ్దిదారులకు, ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయాన్ని ప్రచారం చేసుకుంటే, ప్రభుత్వానికే మంచిది. 5 రూపాయిల భోజనం అని చిన్నచూపు చూసేవారికి కూడా విలువ తెలుస్తుంది. ఈ పథకానికి ఖర్చు చేస్తున్న రూ.200 కోట్ల నిధుల వినియోగాన్ని, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలి. అసలు ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తున్న విషయం ప్రజా ప్రతినిధులకు కూడా తెలియదన్న విషయం మా ఆధ్యయనంలో తేలింది.
  • అన్న క్యాంటీన్లలో భోజనం నాణ్యత విషయంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ నాయకులు నడిపిన ప్రయివేట్ అన్న క్యాంటీన్లలో పెట్టిన భోజనంతో పోల్చుకుంటున్నారు. నాయకులు నడిపిన క్యాంటీన్లలో పెట్టినట్టు ఆహార పదార్థాలు పెట్టాలని కోరుతున్నారు. రూ.20కే బయట బండి కొట్ల వద్ద 5 ఇడ్లీలు లేదా మంచి టిఫిన్ ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇస్తున్న రూ.22తో ఇంకా మంచి టిఫిన్ అందించవచ్చు. అక్షయపాత్ర మంచి సంస్థ. వారి నుంచి ఇంతకంటే మెరుగైన ఆహారం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కర్రీలు, అల్పాహారం వండే విధానం మారుస్తూ ఉండాలి.
  • ఒకేరుచిలో కాకుండా... ఫ్రై కర్రీలు, వెజిటేబుల్ కర్రీలు ఇస్తే బాగుంటుంది. స్పైసీగా ఉండాలని, వేడిగా ఆహారాన్ని అందించేలా అన్ని చోట్ల హాట్ బాక్సుల్లో అందించాలని కోరుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఇలా చేయడం వల్ల లబ్దిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం ఉద్దేశించిన పోషకాహార లక్ష్యం కూడా నెరవేరుతుంది.
  • అక్షయపాత్ర వారు ప్రస్తుతం అన్న క్యాంటీన్లతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి కూడా వారే ఆహారం అందజేస్తున్నారు. ప్రస్తుతం అక్షయపాత్ర కిచెన్లు ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా రెండు జిల్లాలకు ఒకటి ఉంటున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాలకు ఆహారం వెళ్లేసరికి చల్లబడి నాణ్యత తగ్గుతోంది. దీనిని దృష్టి లో ఉంచుకుని మరిన్ని కిచెన్లు పెంచాలని ప్రభుత్వం అక్షయపాత్ర సంస్థకు సూచించాలి.
  • అన్న క్యాంటీన్లలో పని చేస్తున్న సిబ్బంది దురుసు ప్రవర్తన విషయంలో లబ్దిదారుల్లో ఉన్న అసంతృప్తిని నివారించడానికి ఓపికతో వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. సిబ్బంది ప్రవర్తనను స్థానిక అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి, అవసరమైన చోట కఠిన చర్యలు తీసుకోవాలి. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్కోడ్ పెట్టాలి. లబ్దిదారులకు ఇవ్వాల్సిన క్వాంటిటీ ఇవ్వకుండా చేతివాటం చూపిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • మా సర్వే ప్రకారం అన్న క్యాంటీన్లకు అందాల్సిన ఆహార పదార్థాలు రోజుకో సమయానికి అందుతున్నాయి. దీని వల్ల క్యాంటీన్ నిర్వాహణలో ఇబ్బందులు ఎదరవుతున్నాయి. కిచెన్లో ఏ సమయానికి ఆహారం సరఫరా చేసే వాహనాలు ప్రారంభమయ్యాయి? క్యాంటీన్కి ఎప్పుడు ఆహార పదార్థాలు అందించాయి? అనే విషయాలను రోజూ లాగ్ బుక్లో నమోదు చేయాలి. వీటిని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి క్వాంటిటీలో ఆహార పదార్థాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల 400 గ్రాములు ఇవ్వాల్సిన రైస్, 350 గ్రాముల రైస్ ఇస్తున్నట్లు అనేక చోట్ల ఫిర్యాదులు వచ్చాయి.
  • తాగునీటి సౌకర్యం, శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ప్లేట్లను శుభ్రంగా కడిగేలా సిబ్బందికి సూచించాలి. టేబుల్స్ని కూడా వెంటవెంటనే శుభ్రం చేయించాలి. శుభ్రతకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • ప్రతి క్యాంటీన్లో తగినంత 5 రూపాయిల కాయిన్స్ అందుబాటులో ఉండడం లేదు. పేదవారికి యూపీఐ చేసే స్తోమత కూడా లేకపోవడంతో చిల్లర సమస్య తలనొప్పిగా మారింది. చిల్లర సమస్యను నివారించడానికి ప్రతి క్యాంటీన్లో తగినన్ని 5 రూపాయిల కాయిన్స్ అందుబాటులో ఉంచాలి.
  • టోకెన్ సిస్టమ్ దాదాపు 40 శాతం క్యాంటీన్లలో అమలు కావడం లేదు. సిబ్బంది డబ్బులు తీసుకుని, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం... సిస్టమ్స్పని చేయకపోవడం. టోకెన్లు ఇవ్వకపోవడం వల్ల సిబ్బంది చేతివాటం పెరిగింది.
  • అన్న క్యాంటీన్లలో చాలాచోట్ల సీసీ కెమెరాలు పని చేయడం లేదు. వీటిని వెంటనే మరమ్మత్తులు చేసి, సెంట్రలైజ్డ్గా పర్యవేక్షించాలి.
  • ఆహార పదార్థాల నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, శుభ్రత తదితర విషయాలపై ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా లోపంగానే చూడాలి. లోటుపాట్లు తెలుసుకోవడానికి ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన క్యూ ఆర్ స్కాన్ సులభంగా ఉపయోగించలేపోతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నవారు తక్కువమంది ఉండటం, దీనిపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు. దీనికి బదులుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ గానీ, సలహాల బాక్స్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
  • మహిళల కోసం ప్రత్యేకంగా అన్న క్యాంటీన్ ని ప్రయోగాత్మక ప్రారంభించి, వీటిని మహిళా సంఘాలకు అప్పగిస్తే బాగుంటుంది. దీంతో పేద మహిళలకు పోషకాహారం అందడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కూడా లభిస్తుంది.
  • అన్న క్యాంటీన్లు పట్టణ ప్రాంతాలు, నియోజకవర్గాల కేంద్రాలకే పరిమితం చేయకుండా, వీటిని విడతల వారీగా మండల కేంద్రాలకు విస్తరించాలి.
  • అన్న క్యాంటీన్ల నిర్వాహణ వీలైనంత ఎక్కువమంది దాతలను భాగస్వామ్యం చేయాలి. ఒక అన్నక్యాంటీన్లో ఒక రోజూ మొత్తం నిర్వహించడానికి సుమారు 26 వేలు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును అందించిన దాతలకు గౌరవంగా క్యాంటీన్లో ఒక డిస్ ప్లే బోర్డ్, వారి వివరాలు నమోదుచేయాలి. దీని కోసం స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. దీని వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గడంతో పాటు మరిన్ని ప్రాంతాలకు క్యాంటీన్లను విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
  • చాలాచోట్ల ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మద్యం సేవించి వస్తుండటంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతోంది. దీని నివారణకు ప్రతి అన్న క్యాంటీన్ వద్ద లోకల్ పోలీస్ లేదా సచివాలయం సిబ్బంది డ్యూటీ చేస్తే, క్యాంటీన్ నిర్వాహణ సాఫీగా సాగుతుంది.
  • న్న క్యాంటీన్లలో అందించే అల్పాహారం మెనూలో అప్పుడప్పుడు పులిహోరా, టమోటా రైస్, కిచిడి, వెజ్ బిర్యానీ వంటి రైస్ ఐటమ్లు కూడా ఉంటే బాగుంటుందని అనేక మంది అభిప్రాయపడ్డారు.
  • ముఖ్యమంత్రి మొదలుకొని దిగువ స్థాయి ప్రజా ప్రతినిధుల వరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి దిగువ సిబ్బంది వరకు కనీసం నెలలో ఒక్కసారైనా ఈ అన్న క్యాంటీన్లను ఆకస్మీకంగా తనిఖీ చేయడంతో పాటు భోజనం చేయడం వల్ల క్యాంటీన్ల మీద విశ్వసనీయత పెరుగుతుంది.
  • ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో సహా అన్న క్యాంటీన్ల పనితీరుపై క్రమంతప్పకుండా సమీక్షించాలి. తద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు సాధించవచ్చు.
  • అన్న క్యాంటిన్ల పర్యవేక్షణను ఆయా ప్రాంతాల్లోని సచివాలయాలకు అప్పగించాలి.
  • ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా క్రమం తప్పకుండా అన్న క్యాంటిన్లలో అందిస్తోన్న ఆహారాన్ని తనిఖీచేయాలి
  • ప్రయోగాత్మకంగా కొన్ని క్యాంటిన్లను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించి, వారు నడిపే తీరును పరిశీలించి భవిష్యత్తులో వారికి ఈ క్యాంటిన్లను అప్పగించేలా ప్రణాళికలు రూపొందించాలి.
  • అన్న క్యాంటిన్లలో అందిస్తోన్న ఆహారం, దానికి ఖర్చు చేస్తున్న బడ్జెట్ తదితర అంశాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ఈ క్యాంటిన్లపై ప్రచారం విస్తృతంగా చేయాలి
  • రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పేదలకు ఆహారం అందిస్తోన్న అన్నా క్యాంటిన్లను తనిఖీ చేసి ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి. తద్వారా ఈ పథకం మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వారి వంతు సహకారం అందించాలి.
  • కార్పొరేట్ సంస్థలు వారి సిఎస్సార్ ఫండ్స్ ద్వారా అన్న క్యాంటిన్లకు సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి.
  • రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు అన్న క్యాంటిన్లు ఆహార సరఫరా చేస్తున్న కిచెన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
  • అనేక యూట్యూబ్ ఛానెళ్లు ఆహారం అందించే హోటళ్లపై వీడియోలు చేస్తారు. అన్న క్యాంటిన్లపై కూడా ఆయా యూట్యూబ్ ఛానెళ్లు వీడియోలు చేసి వీటికి మరింత ప్రచారం కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
  • 2019 ఎన్నికల సందర్భంగా దేశంలోనే ప్రముఖ రీసెర్చి సంస్థ సిఎస్డిఎస్ -లోక్ నీతి నిర్వహించిన సర్వే ప్రకారం అన్న క్యాంటిన్ల వల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరిందని వెల్లడైంది.
  • రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్న క్యాంటిన్ల పనితీరుపై ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహించడమే కాకుండా ప్రముఖ రీసెర్చి సంస్థలతో ప్రతి ఆర్నెళ్లకోసారి థర్డ్ పార్టీ సర్వే నిర్వహించి వాటి పనితీరును మరింత మెరుగు పరచాలి.
  • సెలెబ్రెటీలు కూడా అన్న క్యాంటీన్లను సందర్శించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
Advertisement

Next Story

Most Viewed