సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోందా.. మళ్లీ గట్టెక్కాలంటే ఆ పని చేయాల్సిందేనా?

by Disha Web Desk 2 |
సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోందా.. మళ్లీ గట్టెక్కాలంటే ఆ పని చేయాల్సిందేనా?
X

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై సీఎం జగన్​స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓటేసిన వాళ్లంతా నగదు బదిలీ పథకాలు పొందినది నామమాత్రమేనని తేల్చారు. ఇది తమ ప్రభుత్వానికి రెఫరండం కాబోదని చెప్పుకొచ్చారు. సగటున 87 శాతం కుటుంబాలకు ప్రభుత్వం ఏదో రూపంలో లబ్ధి చేకూర్చింది. వాళ్లంతా మనవైపే ఉన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా మళ్లీ అధికారానికి వస్తామని సీఎం జగన్​ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు భరోసా ఇచ్చారు. మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మీరు చేయాల్సింది మీరు చేయండి. నేను చేయాల్సింది చేస్తానని ఉద్ఘాటించారు. సీఎం జగన్​సమీక్షలో దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు ఏం చేయాలనేది కనిపించలేదు. అసలు వాళ్లు మన ఓటర్లే కాదని గతంలో సజ్జల వ్యాఖ్యానించిన దానికి కట్టుబడి ఉన్నట్లు వ్యక్తమైంది. ఈ లెక్కన చూస్తే అధికార వైసీపీ పోరాడాల్సిన మారీచుల సంఖ్య పెరిగినట్లుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

దిశ, ఏపీ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, జర్నలిస్టులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులున్నారు. మూడు నియోజకవర్గాల్లో సుమారు 8 లక్షల మంది ఓటర్లుంటే అందులో ప్రభుత్వ నగదు బదిలీ పథకాలు అందుకుంటున్నది కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమేనని సీఎం జగన్​వెల్లడించారు. అందువల్ల దీన్ని ఓ శాంపిల్‌గా తీసుకోలేమని పేర్కొన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు సుముఖంగా లేనట్లు తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్న వాళ్లు ఓట్లేస్తే చాలనే సంకేతాలు ఇస్తున్నట్లుంది. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడం ద్వారా మళ్లీ అధికారానికి వస్తామనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

ప్రజాభిప్రాయాలను మలచగలిగే స్థాయి ఉన్నోళ్లు..

ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలు తమకు ఇష్టమున్న వాళ్లకు ఓటేసి గమ్మున ఉండే రకం కాదు. నోరు గలిగిన మధ్య తరగతి వర్గం. ప్రజల అభిప్రాయాలను మలచగలిగే స్థాయి ఉన్నవాళ్లు. సుమారు 14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు వాళ్ల వరకే పరిమితం కారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్లను కూడా ప్రభావితం చేస్తారు. ఒకటో తేదీ జీతం పడడం లేదని ఆక్రోశించే వేతన జీవుల కుటుంబాలపై ఆధారపడి మరెన్నో జీవితాలున్నాయి. వీళ్లందరి అభిప్రాయాలను మార్చగల స్థాయి ఉద్యోగుల కుటుంబాలకు ఉంటుంది. కాణీ ఖర్చు లేకుండా ఉచితంగా ఇచ్చే అక్రెడిటేషన్​కార్డులు ఇవ్వకుండా జర్నలిస్టులకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. దీంతో వాళ్లంతా ప్రభుత్వంపై కన్నెర్ర జేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 వేల మందికి పైగా ఉన్నారు. వీళ్లంతా ప్రభుత్వ వ్యతిరేకతను ఎన్ని లక్షల మంది మెదళ్లలోకి పంపగలరో అధికార పార్టీ అంచనా వేసినట్లు లేదు.

కౌలు రైతులకు ప్రోత్సాహం కరువు

రాష్ట్రంలో పంటల సాగుకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. రైతు భరోసా, ఇన్​పుట్​సబ్సిడీ, సున్నా వడ్డీ పంట రుణాలతోపాటు చివరకు పంట నష్ట పరిహారం కూడా వాళ్ల దరిచేరడం లేదు. గుర్తింపు కార్డులు పొందిన వాళ్లలో 90 శాతం భూయజమానులకు చెందిన వాళ్లే. సెంటు భూమి లేక కౌలు మీదనే ఆధారపడిన 18 లక్షల కుటుంబాలకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఫీజు రీయింబర్స్ మెంటు పథకాలు ఇచ్చినా వాళ్లు నష్టపోయేదాని ముందు అవి ఎందుకూ కొరగావు. అసలు సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్లలోనే తీవ్ర నిరాశా నిస్పృహలున్నాయి. నాలుగేళ్ల క్రితం తమ బతుకులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడెందుకు ఇంతలా అప్పుల ఊబిలో కూరుకుపోయాయనే ఆక్రందన నెలకొంది. నిరంతరం పెరుగుతున్న కరెంటు, రవాణా చార్జీలు, నిత్యావసరాల ధరలు సగటు కుటుంబాలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజల ఆదాయాలు పెరగకపోగా వ్యయం విపరీతంగా పెరిగింది. ఈ అసంతృప్తి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

అన్ని వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు..

ఇంకా గ్రామ, మండల స్థాయి పాలక వర్గాలు తీవ్ర ఆక్రోశం వెలిబుచ్చుతున్నాయి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వక పోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లిస్తుందని ఆగ్రహంతో ఉన్నారు. పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు సైతం అసంతృప్తితో ఉన్నారు. పనులు చేపట్టడానికి నిధుల్లేవు. చేస్తే బిల్లులు రావంటూ వాపోతున్నారు. అసలు వీళ్లను పట్టించుకున్న దాఖలాల్లేవు. వీళ్లంతా 90 శాతం వైసీపీకి మద్దతుదారులే. నిన్నమొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్లు అసలు పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఏఏ వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి.. ఆయా వర్గాలను ఎలా దగ్గరకు చేర్చుకోవాలనే కోణంలో సమీక్ష జరిగినట్లు లేదు. దీంతో సీఎం జగన్​భావిస్తున్న మారీచులు మరింతగా పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read..

బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి KCR రెడీ.. త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్..?!



Next Story

Most Viewed