రోడ్లలో ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు: డిప్యూటీ CM ఆదేశం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ.2 వేల కోట్లు నిధులు సమకూర్చింది.

రోడ్లలో ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు: డిప్యూటీ CM ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ.2 వేల కోట్లు నిధులు సమకూర్చింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్:నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి సాస్కి నిధులు సమకూరాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వీటిని సద్వియోగం చేసుకుందామన్నారు. సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రహదారుల నాణ్యతలో రాజీపడబోము

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి తీసుకువచ్చిన నిధులు ఇవి. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుపైనా, అధికార యంత్రాంగంపైనా ఉంది. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నాము. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నిర్మాణం కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయండి. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం అవసరం. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తాము. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దు.

ప్రతి గ్రామానికీ మంచి రహదారులు ఉండాలి

ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అవసరం. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవి. సాస్కి ద్వారా వస్తున్న రూ.2వేల కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకొనే అవకాశం వచ్చింది. ప్రత్యేకమైన ప్రాంతాల్లో, సందర్భాల్లో ఈ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. పుట్టపర్తిలో సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడ మౌలిక వసతులు కల్పనలో భాగంగా పంచాయతీ రోడ్లు పటిష్టపరచాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు వివరించారు. ఇందుకోసం రూ.35 కోట్లను ఈ నిధుల నుంచి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలకమైన అభివృద్ధి పనులకు సాస్కి నిధులు ఎంతగానో తోడ్పడతాయి.

రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి అలక్ష్యంతో వ్యవహరించింది. వివిధ మార్గాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించింది. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. నిధులు పొందటంలో, వాటిని వినియోగించే ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇందులో అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలి” పవన్ కల్యాణ్ అన్నారు.

Next Story