మీరెటువైపు? రాహుల్ గాంధీ అంశంపై ప్రతిపక్షాల సైలెంట్..!

by Disha Web Desk 7 |
మీరెటువైపు? రాహుల్ గాంధీ అంశంపై ప్రతిపక్షాల సైలెంట్..!
X

‘మేరా ఘర్​ఆప్​కీ ఘర్!’ అంటూ నెటిజన్లు రాహుల్​ గాంధీకి మద్దతు తెలుపుతున్నారు. రాహుల్​గాంధీని క్వార్టర్స్​ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో మాఇల్లే మీఇల్లంటూ నెట్టింట పోస్టులు వైరల్ ​అవుతున్నాయి. కాంగ్రెస్​నేత రాహుల్ గాంధీ పట్ల బీజేపీ, కేంద్ర సర్కారు అనుసరిస్తోన్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా గర్హిస్తున్నారు. అదానీ సంస్థల్లోకి వచ్చిన రూ.20 వేల కోట్ల పెట్టుబడుల గురించి రాహుల్​ప్రశ్నించడం నేరమా అంటూ నెటిజన్లు కన్నెర్రజేస్తున్నారు. రాహుల్​పార్లమెంట్ సభ్యత్వాన్ని నిరంకుశంగా రద్దు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎలుగెత్తి చాటుతున్నారు. రాహుల్‌తో జైలుకు వెళ్లడానికైనా వెనుకాడనని తమిళనాడు సీఎం స్టాలిన్​ ప్రకటించారు. కేంద్ర సర్కారు తీరును బీఆర్‌ఎస్​అధినేత కేసీఆర్ ​దుయ్యబడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని పార్టీలు తమ వైఖరిని తెలుపుతున్నా రాష్ట్రంలోని ప్రధాన పక్షాల్లో మాత్రం స్పందన లేదు. తేలు కుట్టిన దొంగల్లా నక్కి తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయ పార్టీలు వేరు కావొచ్చు. వాళ్ల అజెండాలు విభిన్నం కావొచ్చు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా ఆయా పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తుంటాయి. దేశానికి దశ, దిశ నిర్దేశం చేసిన భారత ప్రధాని జవహర్​లాల్​నెహ్రూ వారసుడు రాహుల్​గాంధీ పట్ల బీజేపీ నేతలు, కేంద్ర సర్కారు అనుసరిస్తోన్న కక్షపూరిత చర్యలను దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసిస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కి ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌పై ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఎన్డీయే సర్కారు తీరుతెన్నులను దుయ్యబడుతున్నారు. బాలీవుడ్​నటి దీపికా పదుకొనే స్పందిస్తూ దేశం కోసం బలి దానమిచ్చిన కుటుంబం వైపు నిలుస్తారో.. బ్రిటిష్​దొరల కాళ్లు పట్టుకున్న వాళ్ల పంచన చేరుతారో తేల్చుకోవాలని ఆవేదనతో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాహుల్​గాంధీ పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ రాజధాని ఢిల్లీలో 17 రాజకీయ పార్టీల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

గొంతు పెగలని అధికార, ప్రతిపక్షాలు

రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు మాత్రం రాహుల్​పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుపై నోరు మెదపడం లేదు. మాకు బీజేపీతో సంబంధం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కే వైసీపీ మౌనం వహించింది. 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్​సైతం ఒకానొక దశలో బీజేపీ ఓ అరాచకపార్టీగా అభివర్ణించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలిని అనిచెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం నోరు విప్పడం లేదు. ఇక ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అంటోన్న జనసేన అధినేత పవన్​కల్యాణ్‌కు గొంతు పెగలడం లేదు. రాహుల్​గాంధీ పట్ల కేంద్ర నిరంకుశ వైఖరిపై గళం విప్పాలని కాంగ్రెస్​నేత కేవీపీ రామచంద్రరావు నోరు తెరిచి విజ్ఞప్తి చేశారు. అయినా అధికారం కోసం కొట్లాడుకుంటున్న ఈ మూడు పార్టీల్లో స్పందన లేదు. సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్షాలు రాహుల్‌కు బాసటగా నిలిచాయి.

ప్రజాస్వామ్య పరిరక్షణపై బాధ్యతేదీ?

సీఎం జగన్​తన అక్రమాస్తుల కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలనే కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నట్లు విపక్షాలు కోడైకూస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లున్న బీజేపీ స్నేహ హస్తం కోసం అర్రులు చాస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీకి భయపడి టీడీపీ నేతలు నోరు తెరవడం లేదనే విమర్శలున్నాయి. అసలు ఇంతవరకు అధికారాన్ని చవిచూడని పవన్​కల్యాణ్‌కు ఏమైందంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మూడు పార్టీలకు అధికార యావ తప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల బాధ్యత లేదా? అంటూ నెట్టింట నిలదీస్తున్నారు. మొన్నామధ్య రాష్ట్రంలో సీఎం జగన్​నియంతృత్వ పోకడలను నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు నడుం బిగించాలని చంద్రబాబు, పవన్​ పిలుపునిచ్చారు. మరి ఇప్పుడు రాహుల్​గాంధీ విషయంలో కేంద్రం తీరును దేశవ్యాప్తంగా ఖండిస్తుంటే చంద్రబాబు, జనసేనాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

రేపు వీళ్లకు అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు?

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ పట్ల కేంద్ర సర్కారు అనుసరించిన తీరు సరైంది కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడంగానే చూడాలి. ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగినప్పుడల్లా రాజకీయ పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తుంటాయి. రాష్ట్రంలోని ప్రధాన పక్షాలు మాత్రం నోరు మెదపడం లేదు. రేపు వీళ్లకు అలాంటి పరిస్థితి రాదనుకుంటున్నారా! అప్పుడేం చేస్తారు? మరీ ఇంత పచ్చి అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నాయి. వీళ్ల దివాళాకోరు రాజకీయాలను ప్రజలు చీదరించుకుంటున్నారు.

- కేఎస్​లక్ష్మణరావు, పీడీఎఫ్​ఎమ్మెల్సీ

రాహుల్​పట్ల కేంద్ర వైఖరి దుర్మార్గం

కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ పట్ల ఎన్డీయే సర్కారు అనుసరించిన తీరు చూస్తుంటే బీజేపీ అన్ని వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టిస్తుందో తెలుస్తోంది. రాహుల్​విషయంలో రాజ్యాంగ విలువలను పాతరేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ లాంటి సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయి. వీటిని విపక్షాలపై దాడికి ఉసిగొల్పుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్న బీజేపీ తీరును దేశవ్యాప్తంగా నిరసిస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పక్షాలు మౌనం వహించడం దారుణం. మేం కాంగ్రెస్​ విధానాలకు వ్యతిరేకమైనా రాహుల్​పట్ల కేంద్రం తీరును నిరసిస్తున్నాం.

- బాదర్ల కృష్ణ ప్రసాద్, ఆప్​నేత

Next Story

Most Viewed