'గురువును దైవంగా భావించే సమాజం మనది.. కానీ, ఏపీలో పరిస్థితి అలా లేదు'

by Disha Web Desk 2 |
గురువును దైవంగా భావించే సమాజం మనది.. కానీ, ఏపీలో పరిస్థితి అలా లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెబుతూనే.. మరోపక్క వైసీపీ సర్కార్‌పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. ''పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే మహత్కార్యాన్ని నిర్వర్తిస్తోన్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువును దైవంగా భావించే సమాజం మనది. తలెత్తుకు జీవించే గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు ఏపీలో ఈరోజు ప్రభుత్వ కక్ష సాధింపుకు గురవుతుండటం దురదృష్టకరం. గురుపూజోత్సవం వేళ గురువులకు జీతాల చెల్లింపు చెయ్యక పోవడమే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవమా? సీపీఎస్‌ రద్దు కోసం అడగకూడదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పుకోసం తాకట్టు పెట్టినా నోరెత్తకూడదు. పాఠశాలల విలీనం పేరిట విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదు. ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చి విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నా వారు కిక్కురుమనకూడదు అంటోంది ప్రభుత్వం. విద్యాశాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షోభానికి ప్రభుత్వం తెరదించాలి. విద్యా వ్యవస్థపై బాధ్యతగా, విద్యను అందించే గురువులపై గౌరవంగా వ్యవహరించాలి.'' అంటూ జగన్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

Also Read : AP News : ఏపీలో టీచర్స్ డే లేనట్లే.. ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం






Next Story